అనుమతి లేకుండా చెట్లను నరికించిన ప్రభుత్వ ఉద్యోగి

చేతిలో అధికారం ఉంది కదా అని ఓ గ్రామపంచాయతీ కారోబార్ ఏపుగా పెరిగిన చెట్లను అడ్డంగా నరికించేశాడు.

Update: 2024-09-04 08:37 GMT

దిశ ప్రతినిధి, నిజామాబాద్: చేతిలో అధికారం ఉంది కదా అని ఓ గ్రామపంచాయతీ కారోబార్ ఏపుగా పెరిగిన చెట్లను అడ్డంగా నరికించేశాడు. నాకెవరు పర్మిషన్ ఇచ్చేది.. గ్రామ పంచాయతీ నాది.. అన్నీ నేనే.. అంతా నేనే అన్న చందంగా ఎవరి పర్మిషన్ లేకుండా చెట్లను నరికే నిర్ణయం సొంతంగా తీసేసుకున్నాడు. కనీసం తన పై అధికారి గ్రామ పంచాయతీ కార్యదర్శికి కూడా కనీస సమాచారం ఇవ్వకుండా చెట్లను నరికేయించాడు.

వివరాల్లోకి వెళితే..

నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం పురానీపేట్ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో పదేళ్ల క్రితం నాటిన మొక్కలు ప్రస్తుతం చెట్లయ్యాయి. వాటి నీడలోనే పిల్లలు చదువుతున్నారు. స్థానిక గ్రామ పంచాయతీలో కారోబార్ గా విధులు నిర్వహిస్తున్న ప్రశాంత్ అనే వ్యక్తి తన ఇంటికి, ఇంట్లో మనుషులకు కోతులతో ఇబ్బందులెదురవుతున్నాయని, చెట్ల కారణంగా కోతులు తన ఇంటి పైకి వస్తున్నాయనే ఉద్దేశంతో చెట్లను టార్గెట్ చేశారు. వాటిని నరికించేయాలని పథక రచన చేశాడు. తను ఒక్కడినే ఈ పని చేస్తే గ్రామంలో టార్గెట్ అవుతాననే ఉద్దేశంతో తన చుట్టు పక్కల ఉన్న మూడు నాలుగు కుటుంబాలను తనకు మద్దతుగా పోగేసుకున్నాడు.

ఇంకేముంది.. చెట్లు నరికే పనికి పాఠశాలకు సెలవు దినాన్ని తనకు అనుకూలంగా మలుచుకున్నాడు. చెట్లను నరికేస్తుండగా టీచర్లు, విద్యార్థులు అడ్డు చెప్పే అవకాశం ఉండదనే ఉద్దేశంతో పాఠశాల సెలవు రోజును ఎంచుకున్నాడు. చెట్లు నరికే సమయంలో తను ఊర్లో ఉండకూడదని ఇతర గ్రామానికి వెళ్లారు. ఫోన్‌లోనే సూచనలు చేస్తూ చేతికి మట్టి అంటకుండా పని కానిచ్చేశాడు. దాదాపు 10 చెట్లను నరికించాడు. నరికేసిన చెట్టు కొమ్మలను తరలించేందుకు గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను సైతం డ్రైవర్ ను పురమాయించి పంపించాడు. ప్రభుత్వ ఖజానా నుంచి కొనుగోలు చేసిన అధికారిక ట్రాక్టర్‌లో అనుమతులేవీ లేకుండా అక్రమంగా నరికేసిన చెట్ల కొమ్మలను, కట్టెలను ఊరిబయటికి తరలించారు.

దీనిపై స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ పెద్దలు, గ్రామ ప్రజలు మండల స్థాయి అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు. పాఠశాలతో విద్యార్థులకు నీడనిచ్చే పచ్చని చెట్లను అనుమతి లేకుండా నరికేయించిన కారోబార్ ప్రశాంత్ పై చర్యలు తీసుకోవాలని పాఠశాల హెడ్ మాస్టర్ తో పాటు, స్థానిక గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు అధికారులకు లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వీడీసీ సభ్యుడు దైడి రవి, గ్రామస్థుడు పత్రి శంకర్‌లు సమస్యను దిశ దృష్టికి తీసుకొచ్చారు. ఈ విషయంపై కారోబార్ ప్రశాంత్ ను వివరణ కోరగా, కోతులతో తమకు చాలా ఇబ్బందిగా మారిందని, పలుమార్లు కోతులు తమను గాయపరిచాయన్నారు. పాఠశాల ఆవరణలో ఉన్న చెట్ల కారణంగానే కోతుల బెడద మాకు పెరిగిందన్నారు. మాతో పాటు మూడు నాలుగిళ్లలోని మనుషులకు ఇబ్బందుల ఉన్నందున చెట్లను నరికేశారన్నారు.

చెట్లు నరికేసినపుడు నేను ఊర్లో లేనని, చెట్లు నరికిన వారు అడిగితే మాత్రం గ్రామపంచాయతీ ట్రాక్టర్ ను డ్రైవర్ ను ఇచ్చి పంపానన్నారు. గ్రామస్థులు తనపై చేసిన ఫిర్యాదుపై తనకు మెమో ఇచ్చారని, దానికి సమాధానం కూడా ఇచ్చానని కూల్‌గా సమాధానమిచ్చాడు. ఓ పక్క రాష్ట్ర ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ కోసం వనమహోత్సవం పేరుతో రాష్ట్ర వ్యాప్తంగా మొక్కలు నాటుతూ అడవులను పెంచాలని ఆలోచిస్తుంటే, ఇంకో పక్క ప్రభుత్వ ఉద్యోగంలో ఉంటూ పాళశాలలో విద్యార్థులకు నీడనిచ్చే చెట్లను కోతుల బెడద పేరుతో నరకడంపై అధికారులు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. మండల స్థాయి అధికారులను మేనేజ్ చేసేందుకు లీడర్లతో ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా అధికారులు ఈ విషయంలో కారోబార్ పై కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు, స్కూల్ హెచ్ ఎం, టీచర్లు కోరుతున్నారు,


Similar News