7 నెలల చిన్నారి అమ్మకం.. ఐదుగురిపై కేసు

Update: 2024-10-06 03:23 GMT

దిశ ఆర్మూర్ : నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పట్టణ కేంద్ర పరిధిలోని పెర్కిట్‌లో కొంతమంది దుండగులు 7 నెలల చిన్నారిని అమ్మకానికి పెట్టారు. ఈ ఘటనపై ఆర్మూర్ పోలీసులు ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు శనివారం రాత్రి తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. నందిపేట్ మండలంలోని సిద్దాపూర్ గ్రామానికి చెందిన అంగేటి లక్ష్మి-పోశెట్టి దంపతులకు జన్మించిన 7 నెలల చిన్నారిని వారం రోజుల క్రితం రూ.30 వేలకు పెర్కిట్‌కు చెందిన షేక్ హబీబి- మహమ్మద్ గౌస్ దంపతులకు అమ్మినట్లు ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ మైనార్టీ దంపతులకు పిల్లలు లేకపోవడంతో వారి కోసం చిన్నారిని కొనుక్కున్నట్లు ఆర్మూర్ ఎస్సై గంగాధర్ వివరించారు.

దీనిపై స్పందించిన ఎస్సై గంగాధర్.. ఘటనపై సమాచారం అందగానే ఆర్మూర్ ఏఎస్ఐ లక్ష్మణ్ విచారణ జరిపి కేసు నమోదు చేసినట్లు తెలిపారు. చిన్నారిని కొనుగోలు చేసిన వారి నుంచి తీసుకొచ్చి జిల్లా కేంద్రంలోని సుభాష్ నగర్ లో ఉన్న ఐసీడీఎస్ బాలల కేంద్రంలో అధికారుల సంరక్షణలో ఉంచినట్లు చెప్పారు. ఈ ఘటనలో ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేశామన్నారు. ఇలాంటి చట్టవిరుద్ధమైన కార్యక్రమాలు చేయడం నేరమని, ఎవరు చేసిన ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.


Similar News