New political party: తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం.. త్వరలో బీసీ రాజకీయ పార్టీ

తెలంగాణ రాజకీయాల్లో సంచలన పరిణామం చోటు చేసుకోబోతున్నది.

Update: 2024-09-22 11:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీసీల కోసం ప్రత్యేక రాజకీయ పార్టీ పెట్టాలనే డిమాండ్లు వస్తున్నాయని, తప్పకుండా పార్టీ పెడతామని రాజ్యసభ ఎంపీ, బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. బీసీ పార్టీ ప్రతిపాదన పరిశీలనలో ఉందని, సమయం కోసం ఎదురు చూస్తున్నామని చెప్పారు. ఇవాళ హైదరాబాద్‌లో అఖిలపక్ష, బీసీ కులసంఘాల రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, టీ కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్‌తో పాటు పలువురు బీసీ కులసంఘాల నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్.కృష్ణయ్య మాట్లాడుతూ.. గతంలో 10 మంది బీసీలు పార్టీ పెట్టినా సక్సెస్ కాలేకపోయారని గుర్తుచేశారు. కానీ ఈసారి తాము సరైన సమయం చూసి పార్టీ పెడతామన్నారు. ప్రభుత్వం కులగణన సమగ్రంగా చేపట్టి జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు పెంచాలని డిమాండ్ చేశారు. గతంలో బీసీల పోరాటాన్ని వక్రీకరించారని, ఈ సారి మన రిజర్వేషన్లు సాధించుకోకపోతే రిజర్వేషన్లే లేకుండా చేస్తారని హెచ్చరించారు. రిజర్వేషన్ల పెంపుదల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు రాజ్యంగ సవరణ కోసం బీజేపీ ప్రభుత్వం దిగి రావాలన్నారు.

భారీ ఉద్యమం రాబోతోంది

కులగణన విషయంలో ప్రభుత్వం జీవో ఇస్తే ఆ జీవోపై వారి తరఫున వాళ్లే మళ్లీ హైకోర్టుకు వెళ్లే ప్రమాదం ఉందని కృష్ణయ్య హెచ్చరించారు. అందువల్ల అలాంటి పరిస్థితే వస్తే ఎలా వ్యవహరించాలనే విషయాన్ని ముందుచూపుతో ఆలోచన చేయాల్సిన అవసరం ఉందన్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్లోని లోకల్ బాడీ ఎన్నికలపై సుప్రీంకోర్టులో కేసు నమోదైతే అన్ని కేసుల్లో బీసీలకు వ్యతిరేకమైన తీర్పే ఇచ్చారని చెప్పారు. తెలంగాణలోనూ ఇటువంటి ప్రమాదం ఉందని, అప్రమత్తం కావాల్సిన అవసరం ఉందని సూచించారు. అవసరం అయితే రాష్ట్రంలో బంద్ నిర్వహిస్తామన్నారు. ఓ భారీ ఉద్యమం వస్తే తప్ప రిజర్వేషన్లు సాధ్యం కావన్నారు. గతంలో మండల్ కమిషన్ సమయంలోనూ 25శాతం మేర రిజర్వేషన్లను సుప్రీంకోర్టు కొట్టివేస్తే పెద్ద ఎత్తున ఆందోళన చేపడితే కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్‌లో బిల్లు పెట్టిందని గుర్తుచేశారు. 2004లో బీసీ ఉద్యమం రావాల్సి ఉన్నా తెలంగాణ ఉద్యమంతో వెనక్కి వెళ్లిందన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో రిజర్వేషన్ల కోసం పెద్ద ఉద్యమమే రాబోతున్నదని.. ఆ సెగ కేంద్ర ప్రభుత్వం వరకు తాకబోతున్నదన్నారు. ఒక్కరోజులో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు తీసుకువచ్చిన కేంద్రం బడుగుబలహీన వర్గాల కోసం రాజ్యాంగాన్ని సవరించలేదా? అని ప్రశ్నించారు. బిడ్డా.. మీరే ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రి పదవులు అనుభవిస్తూ బీసీలను ఓటర్లుగా మాత్రమే చూస్తారా? అని మండిపడ్డారు.


Similar News