Tungaturthi MLA : ఈ ఖరీఫ్‌తో పాటు వచ్చే రబీ కూడా ఎస్సారెస్పీ జలాలు

ఈ ఖరీఫ్ తో పాటు వచ్చే రబీ సీజన్ కు కూడా శ్రీరామ్ సాగర్ రెండో దశ

Update: 2024-09-18 12:00 GMT

దిశ,తుంగతుర్తి : ఈ ఖరీఫ్ తో పాటు వచ్చే రబీ సీజన్ కు కూడా శ్రీరామ్ సాగర్ రెండో దశ (ఎస్సారెస్పీ) ద్వారా జలాలు అందిస్తామని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ వెల్లడించారు.బుధవారం జనగామ జిల్లా కొడకండ్ల మండల కేంద్రంలోని బయ్యన వాగు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ వద్ద గేట్లు ఎత్తి సూర్యాపేట జిల్లాకు నీళ్లను విడుదల చేసిన సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో ప్రసంగించారు.కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలోనే శ్రీరామ్ సాగర్ రెండో దశ కాలువల తవ్వకాలతో పాటు నీటి విడుదల కూడా జరిగిందన్నారు.ముఖ్యంగా ఎస్సారెస్పీ నీళ్ల కోసం స్వర్గీయ భీమిరెడ్డి నరసింహారెడ్డి పరితపించేవారని పేర్కొంటూ ధన్యవాదాలు తెలిపారు.ముఖ్యంగా కాలువలకు గండ్లు పెట్టకుండా రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.చివరి ఆయకట్టు వరకు నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు.

గత ప్రభుత్వం కాలేశ్వరాన్ని నిర్మించి ప్రభుత్వ ధనాన్ని దోచుకుందన్నారు.కాలేశ్వరం ప్రాజెక్టుతో రైతులకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.గత ప్రభుత్వ హయాంలో రాష్ట్రం దివాలా తీసిందన్నారు.త్యాగాల పార్టీగా కాంగ్రెస్ పార్టీ కొనసాగితే భోగాల పార్టీగా బీఆర్ఎస్ పార్టీ మారిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలోనే అన్ని వర్గాల ప్రజలకు మేలు జరిగిందన్నారు.ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో ఏర్పడిన పరిస్థితుల వల్ల పంటల సాగు కొంత ఇబ్బందికరంగా మారినప్పటికీ తర్వాత కురిసిన భారీ వర్షాలు ఆదుకున్నాయని వివరించారు.నీటి విడుదలతో సూర్యాపేట జిల్లాలో ఉన్న 2.13 లక్షల ఎకరాలకు నీరు అందుతుందని తెలిపారు.సమావేశంలో డీఈ సత్యనారాయణ,ఏఈ అమర్ కుమార్,పార్టీ నాయకులు సుంకరి జనార్ధన్, పాలకుర్తి రాజయ్య,తొడుసు లింగయ్య,ఎల్సోజు నరేష్, చాగంటి రాములు,నాగం సుధాకర్ రెడ్డి,పేరాల వీరేష్, కందుకూరి లక్ష్మయ్య,నరసింహారెడ్డి,ముకుంద రెడ్డి,ఉప్పుల రాంబాబు,చింతకుంట్ల వెంకన్న (బిఎన్) సంకేపల్లి కొండల్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


Similar News