మోడల్ స్కూల్ ముందు స్టూడెంట్ల ధర్నా

Update: 2024-09-03 06:25 GMT

దిశ, వేములపల్లి : తమ హాస్టల్ ను తమకి కేటాయించాలని, ఇక్కడ నిర్వహిస్తున్న కస్తూర్బా పాఠశాలను వేరే చోటుకు తరలించాలని డిమాండ్ చేస్తూ మోడల్ స్కూల్ ఇంటర్మీడియట్ హాస్టల్ విద్యార్థినిలు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 100 మంది విద్యార్థులు ఉండాల్సిన హాస్టల్లో 350 మంది విద్యార్థులను ఉంచారని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో బాత్రూంలో సమస్యతో పాటు పడుకోవడానికి తీవ్ర ఇబ్బందులు కలుగుతున్నాయని సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. గత నెల 15న కస్తూర్బా పాఠశాలను తరలిస్తామని హామీ ఇచ్చి అధికారులు పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నత అధికారుల స్పందించి వెంటనే సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. కాగా ఎంఈఓ సర్ది చెప్పి పాఠశాలలను తరలిస్తామని తెలిపినప్పటికీ, హాస్టల్ ఎస్ ఓ పాఠశాలను తరలించేందుకు ఎలాంటి ప్రయత్నం చేయడం లేదని విద్యార్థులకు తెలియజేసినట్లు ధర్నాలో కూర్చున్న విద్యార్థులు పేర్కొన్నారు.

మూడు గంటల పాటు పాఠశాల విద్యార్థులు బయటనే

హాస్టల్ విద్యార్థులు మోడల్ స్కూల్ ముందు ధర్నా చేపట్టడంతో మోడల్ స్కూల్ లో చదివే పాఠశాల విద్యార్థులతో పాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు ఉపాధ్యాయులు మూడు గంటల పాటు రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. అధికారులు నచ్చ చెప్పినప్పటికీ హాస్టల్ విద్యార్థులు వినకపోవడంతో పాఠశాల విద్యార్థులు తాసిల్దార్ కార్యాలయం పక్కనే ఉన్న చెట్ల కింద సేద తీరుతున్నారు. పలువురు విద్యార్థులు తిరిగి ఇళ్లకు వెళ్లిపోయారు.


Similar News