'గృహలక్ష్మి' పథకం.. మీసేవ కేంద్రాల వద్ద దరఖాస్తుదారుల రద్దీ
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గృహలక్ష్మి' పథకం దరఖాస్తుదారులతో తుంగతుర్తి మండల కేంద్రం గురువారం జాతరను తలపించింది.
దిశ, తుంగతుర్తి: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'గృహలక్ష్మి' పథకం దరఖాస్తుదారులతో తుంగతుర్తి మండల కేంద్రం గురువారం జాతరను తలపించింది. మీసేవతో పాటు ప్రైవేట్గా ఉన్న నెట్ సెంటర్లన్ని జన రద్దీగా మారాయి. కేంద్రాల ముందు దరఖాస్తుదారులు పెద్ద ఎత్తున బారులు తీశారు. అనంతరం తహశీల్దార్ కార్యాలయానికి పెద్ద ఎత్తున చేరుకున్న దరఖాస్తుదారులు ఆదాయం, కులం, స్థానిక, తదితర సర్టిఫికెట్ల ఆమోదం కోసం నిరీక్షణ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
వేల సంఖ్యలో వెళ్లిన దరఖాస్తులను కంప్యూటర్లో పొందుపరచడానికి సిబ్బంది ఇబ్బందిపడ్డారు. అప్పుడప్పుడు సర్వర్ డౌన్ కావడం మరిన్ని ఇబ్బందులు పడ్డారు. దీంతో పెద్ద సంఖ్యలో దరఖాస్తుదారులు కార్యాలయం ఆవరణలో ఉన్న చెట్ల కింద నిరీక్షించారు. ఇదిలా ఉంటే రెండో రోజు (గురువారం) పూర్తి చేసిన ఒక వెయ్యి 92 గృహలక్ష్మి దరఖాస్తులు తహశీల్దార్ కార్యాలయానికి చేరాయి. ఇందులో వెంపటి గ్రామం నుండే అధికంగా రావడం విశేషం.