జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తింపు

జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తించామని, 16వ తేదీనే అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు.

Update: 2024-09-15 11:12 GMT

దిశ, సూర్యాపేట : జిల్లాలో 38 నిమజ్జన ప్రదేశాలు గుర్తించామని, 16వ తేదీనే అన్ని విగ్రహాల నిమజ్జనం పూర్తి చేయాలని జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ అన్నారు. నిమజ్జన ప్రదేశాలకు విగ్రహాలను తరలించడంలో ఆలస్యం చేయొద్దని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ గత రెండు రోజులుగా జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు చేసిన నిమజ్జన ప్రదేశాలను పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ భక్తులకు పలు సూచనలు చేశారు. అధికారుల ఆదేశాలను, పోలీసు సూచనలను పాటించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా ఈనెల 16న అన్ని విగ్రహాలను నిమజ్జనం చేయాలని సూచించారు. గ్రామాల్లో నెలకొల్పిన భక్తులు స్థానికంగా ఉన్న చెరువుల్లోనే నిమజ్జనం చేసుకోవాలని కోరారు. ఆయా గ్రామాల నుండి వాహనాల్లో సుదూర ప్రాంతాలకు వెళ్లి ప్రమాదాల బారిన పడవద్దని సూచించారు.

     ఊరేగింపులకు పోలీస్ శాఖ పటిష్టమైన భద్రత ఏర్పాటు చేసిందని అన్నారు. సూర్యాపేట పట్టణంలో మినీ ట్యాంక్ బండ్, సూర్యాపేట రూరల్ పరిధిలో మూసీ ప్రాజెక్టు, కోదాడలో కోదాడ పెద్ద చెరువు, అనంతగిరి మండలంలో పాలేరు వాగు, చింతలపాలెంలో బుగ్గ మాదారం పుష్కర ఘాటు, మట్టపల్లి వద్ద కృష్ణానది, మహంకాళిగూడెం పుష్కర ఘాటుతో పాటు జిల్లా వ్యాప్తంగా 38 నిమజ్జన ప్రదేశాలను గుర్తించినట్లు తెలిపారు. ఊరేగింపులను పోలీసులు సీసీ కెమెరాలతో నిఘా ఉంచి వీడియో రికార్డింగ్, ఫొటోస్ తీయనున్నట్టు చెప్పారు.

    ఊరేగింపుకు ఉపయోగించే వాహనాలు పూర్తి కండీషన్ లో ఉండాలని, డ్రైవర్ జాగ్రత్తలు పాటించాలని, పిల్లలను, వృద్ధులను ఆయా వాహనాల్లో ఎక్కించవద్దని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 2,700 విగ్రహాలకు అనుమతి ఇచ్చామని పేర్కొన్నారు. మద్యం తాగి ఇతరులకు అసౌకర్యం కల్పించవద్దని, వికృతమైన సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ లు చేయొద్దని కోరారు. డీజేలు పెట్టొద్దని, బాణాసంచా పేల్చవద్దని సూచించారు. హాస్పిటల్, మసీదులు, చర్చిలు, స్కూల్స్, వృద్ధాశ్రమాలు ఉన్న చోట శబ్దాలు చేయవద్దని సూచించారు. సోదరభావంతో అందరూ కలిసి మెలిసి ఉత్సవాలను జరుపుకోవాలని కోరారు. తాగునీటి కోసం ఉపయోగించే కాల్వల్లో నిమజ్జనం చేయొద్దన్నారు. 

Tags:    

Similar News