జమిలి అంటే ఎందుకు జంకు?: డీకే అరుణ
జమిలి ఎన్నికలంటే.. ప్రతిపక్షాలకు అంత జంకు ఎందుకని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు....
దిశ, తెలంగాణ బ్యూరో: జమిలి ఎన్నికలంటే.. ప్రతిపక్షాలకు అంత జంకు ఎందుకని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ప్రశ్నించారు. సికింద్రాబాద్ పరిధిలో ఆదివారం చేపట్టిన బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ఆమె హాజరై మాట్లాడారు. ప్రతి అంశాన్ని రాజకీయం చేయడం కాంగ్రెస్కు అలవాటేనని ఆమె చురకలంటించారు. 2019 నుంచి జమిలి ఎన్నికలపై చర్చ సాగుతోందని, వన్ నేషన్.. వన్ ఎలక్షన్ అనేది కొత్తేమీ కాదన్నారు. అధికార పార్టీ నిర్ణయాలను వ్యతిరేకించడం ప్రతిపక్షాలకు అలవాటేనని ఎద్దేవాచేశారు. అభివృద్ధి జరగాలంటే జమిలి ఎన్నికలకు సహకరించాలని సీఎం రేవంత్కు కౌంటర్ ఇచ్చారు. పార్టీ వేరు అని రేవంత్ రాజకీయం చేయడం సరికాదన్నారు. ఒకేసారి ఎన్నికలు జరిగితే అభివృద్ధి ఎక్కువగా జరిగే చాన్స్ ఉందన్నారు. గతంలో 2014 వరకు రాష్ట్రంలోనూ ఒకేసారి పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలు జరిగాయని డీకే అరుణ గుర్తుచేశారు.