రంగంలోకి KTR, హరీష్ రావు.. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ కోసం కీలక నిర్ణయం..!

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా తీహార్ జైలులో

Update: 2024-07-05 14:00 GMT

దిశ, వెబ్‌డెస్క్: ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్‌లో భాగంగా తీహార్ జైలులో ఉన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఈడీ, సీబీఐ కేసుల్లో కవిత బెయిల్ కోసం పిటిషన్లు దాఖలు చేయగా.. ట్రయల్ కోర్టుతో పాటు ఢిల్లీ హైకోర్టులోనూ ఆమెకు ఊరట దక్కలేదు. దర్యాప్తు సంస్థల వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానాలు కవితకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించాయి. కవితకు బెయిల్ నిరాకరిస్తూ జూలై 1వ తేదీన ఢిల్లీ హై కోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కవిత మరో కీలక నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. లిక్కర్ పాలసీ కేసులో బెయిల్ కోసం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ఆమె నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు సోమవారం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కవిత సోదరుడు కేటీఆర్, బావ హరీష్ రావు ఢిల్లీకి చేరుకున్నారు. శుక్రవారం ఉదయం తీహార్ జైలులో కవితతో ములాఖాత్ అయ్యారు.

ఈ సందర్భంగా సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయడంపై ముగ్గురు చర్చించి.. అనంతరం దేశ అత్యున్నత న్యాయస్థానానికి వెళ్లాలని డిసైడ్ అయినట్లు టాక్. ఈ నేపథ్యంలో కేటీఆర్, హరీష్ రావు సుప్రీం కోర్టులో దాఖలు చేయనున్న బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీలో న్యాయ నిపుణుల బృందంతో చర్చిస్తున్నట్లు సమాచారం. సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ వేసే వరకు కేటీఆర్, హరీష్ రావు ఢిల్లీలోనే ఉండి న్యాయవాదుల బృందంతో సమన్వయం చేయనున్నట్లు తెలుస్తోంది. ట్రయల్ కోర్టు, ఢిల్లీ హై కోర్టులో ఎదురు దెబ్బలు తగిలిన నేపథ్యంలో కవిత సుప్రీంకోర్టును ఆశ్రయించనుంచడటంతో బెయిల్‌పై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. సుప్రీంకోర్టులోనైనా కవితకు ఊరట దక్కుతుందా అని బీఆర్ఎస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు పార్టీ నుండి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు చేజారిపోతుంటే.. కేటీఆర్, హరీష్ రావు మాత్రం కవిత బెయిల్ కోసం స్పెషల్ ఫోకస్ పెట్టడం గులాబీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది.


Similar News