Minister Sridhar Babu: తెలంగాణే పర్‌ఫెక్ట్ అనే స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చాం

రాబోయే ఇరవై ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇటీవల అమెరికా, కొరియా పర్యటనకు శ్రీకారం చుట్టామని, రెండు దేశాల

Update: 2024-08-17 17:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: రాబోయే ఇరవై ఏండ్ల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఇటీవల అమెరికా, కొరియా పర్యటనకు శ్రీకారం చుట్టామని, రెండు దేశాల నుంచి రూ. 36 వేల కోట్ల మేర పెట్టుబడులకు 19 కంపెనీలతో ఎంఓయూలు కుదిరాయని వెల్లడించిన పరిశ్రమల మంత్రి శ్రీధర్‌బాబు... రెండు మూడు నెల్లలోనే అమెజాన్ పెట్టుబడులు రాబోతున్నాయన్నారు. గత ప్రభుత్వంలో కేసీఆర్ స్పెషల్ ఫ్లైట్‌లో చైనాలో పర్యటించారని, దాదాపు వెయ్యి కోట్ల రూపాయల మేర అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకున్నారని, కానీ గ్రౌండింగ్ అయింది మాత్రం రెండొందల కోట్లేనని అన్నారు. సచివాలయంలో శనివారం మీడియాతో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో విదేశీ పర్యటనల ద్వారా కుదిరిన ఎంఓయూలలో 30% మాత్రమే గ్రౌండింగ్ అయ్యాయన్నారు. ఈసారి వంద శాతం గ్రౌండింగ్ అయ్యేందుకు స్పెషల్ సెల్‌ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అమెరికా, కొరియా పర్యటనల్లో కుదిరిన అవగాహనా ఒప్పందాలు కార్యరూపం దాల్చేలా ఈ సెల్ పనిచేస్తుందని వివరించారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత దక్షిణ కొరియా దేశాన్ని సందర్శించడం ఇదే మొట్టమొదటిసారి అని మంత్రి శ్రీధర్‌బాబు గుర్తుచేశారు. విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు హైదరాబాద్ నగరం, తెలంగాణ రాష్ట్రం అనువైనదనే మెసేజ్ ఇవ్వడం కోసమే ఈ పర్యటన సాగిందని, ఆ కంపెనీల్లో ‘ఫ్యూచర్ స్టేట్’ అనే నమ్మకం ఏర్పడందన్నారు. ఎంటర్‌టైన్‌మెంట్ కోసం వెళ్ళినట్లుగా బీఆర్ఎస్ నేతలు విమర్శలు చేస్తున్నరని, కానీ పదేండ్ల కాలంలో ఎన్నిసార్లు విదేశీ పర్యటనలు చేశారో, ఎన్ని కోట్ల రూపాయలకు ఎంఓయూలు కుదిరాయో, ఎన్ని గ్రౌండింగ్ అయ్యాయో బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. అప్పటి ఒప్పందాల్లో కేవలం 30 శాతమే రియలైజ్ అయ్యాయన్నారు. మరోవైపు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నెల రోజుల వ్యవధిలోనే దావోస్ పర్యటనలో సుమారు రూ. 40,232 కోట్ల మేర అవగాహనా ఒప్పందాలు కుదిరాయని, అవి రియలైజ్ అయ్యేలా కంపెనీలతో రాష్ట్ర అధికారులు ఫాలో అప్ చేస్తున్నారని మంత్రి వివరించారు.

అమెరికాలో ఈ నెల ఫస్ట్ వీక్‌లో పర్యటన సందర్భంగా కాగ్నిజెంట్ సంస్థతో ఎంఓయూ కుదిరిందని, దానికి అనుగుణంగానే కేవలం పది రోజుల వ్యవధిలో హైదరాబాద్‌లో కొత్త క్యాంపస్ ఏర్పడిందని మంత్రి గుర్తుచేశారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం అమెరికాలో పర్యటించడం ఇదే ఫస్ట్ టైమ్ అని, ఒప్పందం కుదిరిన పది రోజుల్లోనే కాగ్నిజెంట్ విస్తరణను ప్రత్యక్షంగా చూస్తున్నామన్నారు. కార్నింగ్, ఫాక్స్ కాన్ లాంటి సంస్థలు తెలంగాణను విడిచిపెట్టి వెళ్తున్నాయంటూ బీఆర్ఎస్ నేతలు దుష్ప్రచారం చేస్తున్నాయని, కానీ ఆ రెండూ ఎక్కడికీ వెళ్ళడంలేదని, తెలంగాణలో యూనిట్లను నెలకొల్పే పనిలో ఉన్నాయన్నారు. ఇటీవల అమెరికా టూర్ సందర్భంగా కార్నింగ్ కంపెనీ ప్రతినిధులతో జరిగిన చర్చల్లో ఈ విషయాన్ని స్వయంగా వారే వెల్లడించారని మంత్రి గుర్తుచేశారు. కొత్త టెక్నాలజీతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి, పరిశ్రమలను స్థాపించడానికి ఎవరు ముందుకొచ్చినా స్వాగతిస్తామని, బీఆర్ఎస్ నాయకుల బంధువులు వచ్చినా అదే సూత్రం వర్తిస్తుందన్నారు.

ఎప్పుడైనా విదేశీ కంపెనీలతో ఎంఓయూలు కుదరగానే పెట్టుబడులు రావని, గ్రౌండింగ్ కావడానికి కొంత సమయం పడుతుందన్నారు. గత ప్రభుత్వంలో సీఎం నేతృత్వంలోని బృందం భారీగా ఖర్చు పెట్టి రెండు స్పెషల్ ఫ్లైట్లలో చైనా వెళ్ళి ఒప్పందాలను కుదుర్చుకున్నా 30% కూడా గ్రౌండింగ్ కాకపోవడాన్ని దృష్టిలో పెట్టుకునే ఈసారి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నట్లు ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఈ కారణంగానే ప్రత్యేక ఇండస్ట్రియల్ పాలసీని ప్రభుత్వం తీసుకురాబోతున్నదన్నారు. గతంలోని ఏ ప్రభుత్వాలు అనుసరించిన మంచి పనులనైనా ఇప్పుడు తాము కొనసాగించడానికి ఎలాంటి భేషజాలు లేవన్నారు. గతంలో సంప్రదింపులు జరిగిన, ఎంఓయూలు కుదుర్చుకున్న కంపెనీలతో రాష్ట్ర పరిశ్రమల శాఖ అధికారులు టచ్‌లో ఉన్నారని, ఫాక్స్ కాన్ సంస్థ సైతం త్వరలో రాష్ట్రంలో భారీ పెట్టుబడులతో కొత్త యూనిట్లను నెలకొల్పనున్నదని, ఢిల్లీలో రెండు రోజుల క్రితం కూడా చర్చలు ఫలప్రదంగా ముగిశాయని మంత్రి గుర్తుచేశారు.

Tags:    

Similar News