Minister Ponnam: హైదరాబాద్లో పలుచోట్ల భారీ వర్షం.. అధికారులకు మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది.
దిశ, వెబ్డెస్క్: హైదరాబాద్ (Hyderabad) వ్యాప్తంగా శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. ఒక్కసారిగా కురిసిన వర్షం కారణంగా నగరంలోని లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. వర్షం కారణంగా కూకట్పల్లి, అమీర్పేట్, మియాపూర్, తదితర ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అవ్వడంతో వాహనదారులు రోడ్లపైనే పడిగాపులుకాశారు. ఉప్పల్, ఎల్బీనగర్, నాగోల్, తార్నాక, సికింద్రాబాద్, కంటోన్మెంట్ ప్రాంతాలను వర్షం ముంచెత్తింది. ముషీరాబాద్, చిక్కడపల్లి, నారాయణగూడలో హిమాయత్నగర్, బషీర్బాగ్, అబిడ్స్ కోఠి, నాంపల్లి, లక్డీకాపూల్, అల్వాల్, హకీంపేట్, చార్మినార్లో పాంత్రాల్లో భారీ వర్షం పడింది.
ఈ క్రమంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ (Minister Ponnam Prabhakar) అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. రాబోయే మరో రెండు గంటల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉండటంతో జీహెచ్ఎంసీ, పోలీసు సిబ్బంది సమన్వయంతో పని చేయాలని సూచించారు. ముఖ్యంగా డీఆర్ఎఫ్ (DRF), ఎన్డీఆర్ఎఫ్ (NDRF) బృందాలు అప్రమత్తంగా ఉండలని సూచించారు. లోతట్టు ప్రాంతాల్లో ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా చూడాలన్నారు. అదేవిధంగా ప్రాణ నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని మంత్రి పొన్నం సూచించారు. 141 వాటర్ లాగింగ్ పాయింట్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని మంత్రి పొన్నం జీహెచ్ఎంసీ (GHMC) అధికారులను ఆదేశించారు.