ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికేశారు ..!

ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికేశారు. ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 163 పక్కన గత రెండు, మూడు రోజులుగా రాత్రి సమయాల్లో జరుగుతున్నఈ తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Update: 2024-09-07 10:01 GMT

దిశ, ఘట్కేసర్ః ప్రకటనల కోసం పచ్చని చెట్లను నరికేశారు. ఘట్కేసర్ పట్టణ కేంద్రంలో జాతీయ రహదారి 163 పక్కన గత రెండు, మూడు రోజులుగా రాత్రి సమయాల్లో జరుగుతున్నఈ తతంగం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈసీఐఎల్ క్రాస్ రోడ్డు నుంచి వరంగల్ వైపు వెళ్లే బస్ స్టాప్ పక్కన సర్వీస్ రోడ్డు ఆనుకొని ఉన్న భవనాలపై ఏర్పాటు చేసుకున్నహోర్డింగ్లు కనిపించడం కోసం ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. దాదాపు 100కు పైగా చెట్లు నరికేసిన ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. పచ్చని చెట్లతో కళకళలాడుతున్న ఈ వాతావరణం ప్రస్తుతం నేల వాలిన కొమ్మలతో కనిపిస్తోంది. ఒక్కసారిగా ఇన్ని చెట్లను నరికి వేయడం పలువురిని విస్మయానికి గురిచేస్తోంది.

రాష్ట్ర ప్రభుత్వం ఓవైపు పర్యావరణం పరిరక్షణ కోసం వన మహోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తుంటే... వ్యాపారులు తమ వాణిజ్య వ్యాపారాల కోసం చెట్లను నరకడం పై ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ వ్యాపార కార్యకలాపాలకు, ఇతర అవసరాలకు చెట్లు అడ్డుగా ఉంటే సంబంధిత అధికారుల నుంచి అనుమతి తీసుకొని తొలగించాలే తప్ప.. ఇలా సొంత నిర్ణయాలు తీసుకొని చెట్లను నరకడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నిస్తున్నారు. చెట్లను నరికిన వారిని గుర్తించి జాతీయ రహదారులు, అటవీశాఖ, మున్సిపల్ శాఖ, పోలీస్ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.


Similar News