నిధులు లేక ప్రభుత్వ విభాగాలు పని చేయడం లేదు

అభివృద్ధి పనులకు సరిపడా నిధులు లేక జీహెచ్​ఎంసీ, జలమండలి విభాగాలు పనులు చేపట్టడం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు.

Update: 2024-10-25 10:57 GMT

దిశ, కూకట్​పల్లి : అభివృద్ధి పనులకు సరిపడా నిధులు లేక జీహెచ్​ఎంసీ, జలమండలి విభాగాలు పనులు చేపట్టడం లేదని ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఎమ్మెల్యే క్యాంప్​ కార్యాలయంలో శుక్రవారం కేపీహెచ్​బీ డివిజన్​ కార్పొరేటర్​ మందాడి శ్రీనివాస్​ రావు, ముఖ్య నాయకులు, మహిళా నాయకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్​ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నిధులు లేక అభివృద్ధి పనులు జరగడం లేదని, జీహెచ్​ఎంసీ, జలమండలి అధికారులు ఏ పనులు చేయడం లేదని అన్నారు.

    హైదరాబాద్​ మహానగరంలో ప్రజల బాగోగులు పట్టించుకోవడంలో కాంగ్రెస్​ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని అన్నారు. బీఆర్​ఎస్​ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో ఉంటూ వారి సమస్యల పరిష్కారం కోసం దృష్టి సారించాలని కోరారు. బీఆర్​ఎస్​ ప్రభుత్వ హయాంలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్​, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్​ చేసిన అభివృద్ధిని ప్రజలు మరిచి పోలేదని, హైదరాబాద్​ మహా నగరాన్ని ప్రపంచంలోనే ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ఘనత బీఆర్​ఎస్​ ప్రభుత్వానికే దక్కుతుందని అన్నారు. కాంగ్రెస్​ ప్రభుత్వ హయాంలో నగరంలోని అన్ని రంగాలు, అన్ని వర్గాల ప్రజలు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటుందన్నారు. సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి పనుల నిర్వహణకు ఒక్క రూపాయి కూడా వెచ్చించలేని పరిస్థితుల్లో జీహెచ్​ఎంసీ, జలమండలి విభాగాలు ఉన్నాయని అన్నారు.

    గత ప్రభుత్వంలో వేల కోట్ల రూపాయలతో కూకట్​పల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకున్నామని గుర్తు చేశారు. నియోజకవర్గ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించే దిశగా ముందుకు వెళదామని కార్యకర్తలు, నాయకులకు పిలుపునిచ్చారు. రాబోయే రోజులలో రాష్ట్రంలో ఏ ఎన్నికలు జరిగినా బీఆర్​ఎస్​ పార్టీ భారీ విజయం సాధించడం ఖాయమని అన్నారు. అలవికాని హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పాలనతో ప్రజలు ఇప్పటికే విసుగెత్తి పోయారని అన్నారు. ఎక్కడ ఎటువంటి సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డివిజన్​ ప్రధాన కార్యదర్శి రాజేష్, సాయిబాబాచౌదరి, మహిళా నాయకులు తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News