సర్కార్ దవాఖానలో మెరుగైన చికిత్సను అందించాలి : జిల్లా కలెక్టర్

సర్కార్ దవాఖానలో మెరుగైన చికిత్సను అందించాలని మేడ్చల్

Update: 2024-07-05 12:44 GMT

దిశ,మేడ్చల్ బ్యూరో : సర్కార్ దవాఖానలో మెరుగైన చికిత్సను అందించాలని మేడ్చల్ జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. వైద్యులు, సిబ్బంది అందుబాటులో ఉండాలని ఆదేశించారు. శుక్రవారం ఉప్పల్ లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, మల్కాజిగిరి ఏరియా హాస్పిటల్ లను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.ఆసుపత్రిలోని అన్ని వార్డు లను, ఓపిలను, ల్యాబ్, ఐ సీయూ యూనిట్, ఆక్సిజన్ యూనిట్, ఎక్స్ రే, ప్రసూతి రూమ్ , ప్రత్యేక నవజాత శిశు కేంద్రం ,సునిశితంగా పరిశీలించి,అక్కడ పరిస్థితులు,రోగులకు అందిస్తున్న వైద్య సేవలను క్షుణ్ణంగా పరిశీలించారు. వైద్య సదుపాయాల గురించి వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అవసరమైన చోట వైద్య పరికరాలు సమకూర్చుకోవాలని సూచించారు. ఆసుపత్రులలో వైద్య పరీక్షల గురించి ఆరా తీశారు. ప్రభుత్వ ఆసుపత్రులలో ఎన్ని ప్రసవాలు జరుగుతున్నాయని వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో డెలివరీ సంఖ్య మరింత పెరిగేలా చూడాలన్నారు. హై రిస్క్ ఉన్న కేసులను గుర్తించి గాంధీ,కోటి హాస్పిటల్ కు రిఫర్ చేయాలన్నారు. ప్రతిరోజు ఆసుపత్రికి ఎంతమంది పేషెంట్లు వస్తారని పూర్తి వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ సమస్యలతో వచ్చే పేషెంట్లకు వెంటనే మెరుగైన చికిత్స అందించే విధంగా డాక్టర్లు అందుబాటులో ఉండాలని ఆదేశించారు.

వైద్య సిబ్బంది ఎంతమంది హాస్పిటల్ విధులు నిర్వహిస్తున్నారని ఆరా తీశారు .రోగులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆసుపత్రి నిర్వహణ మెరుగ్గా ఉండాలన్నారు. స్కానింగ్ కోసం స్లాట్ లు బుక్ చేసుకునే విధానాన్ని సిబ్బంది కలెక్టర్ కు వివరించారు. ఫార్మసీలో మందుల నిల్వ గురించి ఆరా తీశారు. ల్యాబ్ రెటర్ లో ఉన్న సౌకర్యాల గురించి, జనరల్ మెడిసిన్,అక్కడ పనిచేస్తున్న సిబ్బందిని క్షుణ్ణంగా పరిశీలించి సౌకర్యాల గురించి తెలుసుకున్నారు. ఇప్పటివరకు మలేరియా డెంగ్యూ కేసులు ఎన్ని వచ్చాయని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు.రాబోయే రోజుల్లో మలేరియా, డెంగ్యూ వ్యాధుల నుండి ప్రజలను కాపాడేందుకు ఆసుపత్రులలో వైద్య సౌకర్యాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.ఆరోగ్యశ్రీ సేవల గురించి వాకబు చేశారు.ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ రఘునాథ స్వామి, ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డి సి హెచ్ కోటియా నాయక్, సౌందర్య లత, డిప్యూటీ డీఎం అండ్ హెచ్ వో ఆనంద్ ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ ఆర్ఎంఓ సునీత, సంగీత్ ,పద్మావతి సంధ్యారాణి, గీతా, చంద్రకళ ప్రోగ్రాం అధికారులు, వైద్యాధికారులు సిబ్బంది పాల్గొన్నారు.


Similar News