12 ఏళ్లుగా సైలెంట్‌గా ఉన్నావ్.. ఇప్పుడే కథనాలు ఎందుకు రాస్తున్నావ్..?

చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై ‘దిశ’ వరుస కథనాలతో రెవెన్యూ అధికారులు ఆగమాగం అయిపోతున్నారు.

Update: 2024-09-25 02:43 GMT

దిశ, సంగారెడ్డి/కొండాపూర్: చెరువు ఎఫ్‌టీఎల్ పరిధిలో నిర్మాణాలపై ‘దిశ’ వరుస కథనాలతో రెవెన్యూ అధికారులు ఆగమాగం అయిపోతున్నారు. ఆ కథనాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ఉన్నతాధికారులు ఆదేశించడంతో ఏం చేయాలో తెలియక వార్తలు రాస్తున్న రిపోర్టర్లను టార్గెట్ చేస్తూ తహసీల్దార్ వివరణ ఇవ్వడం ఆశ్యర్యాన్ని కలిగించింది. ఏడాది నుంచి కొండాపూర్ కేంద్రం ‘దిశ’ విలేకరిగా అనంత్ పని చేస్తున్నాడు. ఇదిలా ఉండగా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువు కుతుబ్ షాయిపేట శివారులో ఎఫ్‌టీఎల్‌లో బహుళ అంతస్తుల నిర్మాణాలు జరిగాయి. ఇదే విషయాన్ని ‘దిశ’లో కథనాల రూపంలో అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అయితే, వరుసగా రెండు కథనాలు రావడంతో ఆగమాగమైపోయిన తహసిల్దార్ నేరుగా పత్రికాప్రతినిధులకు, కార్యాలయాలకు రాతపూర్వక వివరణ పంపించారు.

ఆ వివరణ చదివిన ఎవ్వరైనా ముక్కున వేలేసుకుంటారు. అందులో ఎక్కడా కూడా నిర్మాణాల గురించి, ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయా.. లేవా..? ప్రస్తావించ లేదు. కేవలం రిపోర్టర్‌ను టార్గెట్ చేసి వివరణ ఇచ్చినట్లు స్పష్టం అయింది. నిర్మాణాలు 12 ఏళ్ల క్రితం జరిగితే.. అప్పటి నుంచి విలేకరి సైలెంట్‌గా ఎందుకు ఉన్నారు..? ఇప్పుడే ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలపై ఎందుకు వార్తలు రాస్తున్నారు..? వరుస కథనాలతో అధికారులమైన తమకు ఇబ్బంది కలుగుతుంది. ఇలాంటి వార్తలు రాస్తున్న కొండాపూర్ విలేకరిపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్ యాజమాన్యాన్ని అభ్యర్థించడం గమనార్హం. అసలు చెరువు ఎఫ్‌టీఎల్ ఎంత.. నిర్మాణాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయా.. లేవా..? అనే అంశాలపై మీడియాకు రెవెన్యూ అధికారులు స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అది వదిలేసి రాజకీయ నాయకుల మాదిరిగా వ్యక్తిగత విమర్శలు చేయడం ప్రతిఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది.


Similar News