కాత్యాయాణిగా వన దుర్గమ్మ దర్శనం..

ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల్లో

Update: 2024-10-08 09:33 GMT

దిశ, పాపన్నపేట : ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల్లో కొలువుదీరిన వన దుర్గమ్మ చెంతన మంగళవారం బోనాల జోరు హోరెత్తింది. అంగరంగ వైభవంగా సాగుతున్న దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆరవ రోజైన మంగళవారం షష్టి పురస్కరించుకొని వనదుర్గామాత కాత్యాయని (దుర్గా దేవి) దేవి, ముదురు నీలం రంగు చీరలో అలంకరించి భక్తులకు వనదుర్గమ్మ దర్శనం కల్పించారు. ముఖ్యఅతిథిగా విచ్చేసిన శేరి సుభాష్ రెడ్డి దంపతులు గోకుల్ షెడ్ లో ప్రతిష్టించిన ఉత్సవ విగ్రహం వద్ద జ్యోతి ప్రజ్వలన చేసి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం 101 బోనాలను డప్పు చప్పుళ్లు.. మేళతాళాల మధ్య ఊరేగింపుగా తీసుకెళ్లి వన దుర్గమ్మకు సమర్పించారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వన దుర్గమ్మ క్షేత్రం హోరెత్తింది. వన దుర్గమ్మ తల్లి.. చల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు వేడుకున్నారు.

వన దుర్గమ్మ ఆశీస్సులు మనందరిపై ఉండాలి : ఎమ్మెల్సీ శేరి

వన దుర్గమ్మ తల్లి చల్లని ఆశీస్సులు మనందరిపై ఎల్లవేళలా ఉండాలని ఎమ్మెల్సీ శేరి సుభాష్ రెడ్డి అమ్మవారిని వేడుకున్నట్లు పేర్కొన్నారు. పాడి, పశుసంపద వృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖ సంతోషాలతో సుభిక్షంగా జీవించాలని ఆకాంక్షించారు. ఇట్టి కార్యక్రమంలో మాజీ ఎంపీపీ చందన ప్రశాంత్ రెడ్డి, మెదక్ మున్సిపల్ వైస్ చైర్మన్ మల్లికార్జున్ గౌడ్, ఆలయ పాలకమండలి మాజీ చైర్మన్ సాతెల్లి బాలాగౌడ్, ఆలయ కార్యనిర్వహణాధికారి చంద్రశేఖర్, సిబ్బంది, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News