భక్తులతో కిటకిటలాడిన ఏడుపాయల వన దుర్గమ్మ..

వాగులు, వంకలు.. కొండలు, కోనలు.. దాటి వచ్చిన భక్తజనంతో ఆదివారం ఏడుపాయల వనం జనారణ్యమైంది.

Update: 2024-10-13 12:20 GMT

దిశ, పాపన్నపేట: వాగులు, వంకలు.. కొండలు, కోనలు.. దాటి వచ్చిన భక్తజనంతో ఆదివారం ఏడుపాయల వనం జనారణ్యమైంది. పాపన్నపేట మండలం ఏడు పాయల్లో కొలువుదీరిన వన దుర్గమ్మను దర్శించుకుని భక్తజనం తరించారు. చెక్ డ్యాం, అమ్మవారి ప్రధాన ఆలయం ముందున్న మంజీర నది పాయలో పుణ్య స్నానాలు ఆచరించి, వనదుర్గాదేవి దర్శనానికి బారులు తీరారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండటంతో అమ్మ దర్శనానికి చాలా సమయం పట్టింది. పలువురు భక్తులు అమ్మవారికి డప్పు చప్పుళ్ల మధ్య బోనాలు, ఒడిబియ్యం సమర్పించారు. మరికొందరు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కలు చెల్లించుకున్నారు. భక్తుల జయ జయ ద్వానాల మధ్య ఏడుపాయల వన దుర్గాదేవి క్షేత్రం హోరెత్తింది. చల్లంగా చూడమ్మా.. వన దుర్గమ్మ తల్లి అంటూ భక్తులు వేడుకున్నారు. ఆలయ అర్చకులు పూజలు చేపట్టి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. దర్శనం క్యూ లైన్ లో, వాహనాలకు పూజలు నిర్వహించే రాజగోపురం వద్ద భక్తులు, అర్చకులు షామియానాలు లేక ఎండలో అవస్థలు పడ్డారు. శౌచాలయాలు లేకపోవడంతో మహిళలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. భక్తుల రద్దీ కి తగ్గట్టుగా ఏర్పాట్లు చేయడంలో ఆలయ అధికారులు పూర్తిగా విఫలం చెందారని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Similar News