ఆలయాల్లో భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట.. మంత్రి కొండా సురేఖ

పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తుండగా, తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు.

Update: 2024-09-25 11:49 GMT

దిశ, గజ్వేల్ / కొండపాక : పుణ్యక్షేత్రాల్లో భక్తుల సౌకర్యాల కల్పనకు పెద్దపీట వేస్తుండగా, తెలంగాణ తిరుపతి యాదగిరిగుట్ట అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి సారించి చర్యలు తీసుకుంటున్నట్లు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ పేర్కొన్నారు. బుధవారం సిద్దిపేట జిల్లా కొడకండ్ల శివారులో గజ్వేల్ మాజీ ఎమ్మెల్యే, డీసీసీ అధ్యక్షులు తూంకుంట నర్సారెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆమెకు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణలోని ఆలయాలను ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దుతున్నట్లు స్పష్టం చేశారు. ముఖ్యంగా యాదగిరిగుట్ట వద్ద భక్తులకు మెరుగైన వసతులు కల్పించే క్రమంలో 200 వసతి గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేస్తుండగా, కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో రాయగిరి వద్ద 20 ఎకరాల విస్తీర్ణంలో రూ.43 కోట్ల వ్యయంతో వేద పాఠశాల ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

అలాగే కష్టపడి పార్టీని అధికారంలోకి తెచ్చిన కార్యకర్తల శ్రమను గుర్తిస్తుండగా, వారికి నామినేటెడ్ పోస్టుల భర్తీ, స్థానిక సంస్థల ఎన్నికల్లో అవకాశం కల్పించి ప్రోత్సహించనున్నట్లు తెలిపారు. ముఖ్యంగా నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో పనిచేస్తూ పార్టీ బలోపేతానికి మరింత కృషి చేయాలని, గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ పాలకమండలి బాధ్యతల స్వీకరణ, సన్మాన మహోత్సవానికి హాజరు కానున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో గజ్వేల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ వంటేరు నరేందర్ రెడ్డి, గజ్వేల్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, సిద్దిపేట, దుబ్బాక నియోజకవర్గ ఇన్చార్జిలు హరికృష్ణ, శ్రీనివాస్ రెడ్డి, ఆయా మండలాల కాంగ్రెస్ బాధ్యులు రవీందర్ రెడ్డి, శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎంపీపీ మోహన్, న్యాయవాది సాజిద్ బేగ్, నాయకులు మహేందర్ రెడ్డి, సురేష్, యాదగిరి, రాములు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


Similar News