తగ్గిన మంజీరా ప్రవాహం... భక్తులకు దర్శనమిచ్చిన వన దుర్గమ్మ

పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి

Update: 2024-09-10 09:14 GMT

దిశ, పాపన్నపేట : పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గామాత ఆలయానికి జలదిగ్బంధం వీడింది. 9 రోజులుగా అమ్మవారి ఆలయం జలదిగ్బంధంలోనే ఉన్న సంగతి విధితమే. ఇటీవల కురిసిన వర్షాలకు 30 శతకోటి ఘనపుటడుగుల ఆనకట్ట నిండడం తో పాటు ఎగువన ఉన్న మహారాష్ట్ర నుంచి వరద వస్తుండడంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి పొంగి పొర్లింది. సింగూరు నుంచి దిగువకు నీటిని వదలడం తో పాటు పటాన్ చెరువు సమీపంలోని నక్క వాగు నీరు కూడా చేరడంతో మంజీరాలో వరద ప్రవాహం పెరిగిన సంగతి తెలిసిందే. దీంతో వనదుర్గా ప్రాజెక్టు పూర్తిగా నిండి దిగువకు నీరు ప్రవహించింది.

ప్రాజెక్టు పై నుంచి గంగమ్మ పరవళ్ళు తొక్కుతూ వనదుర్గామాత ప్రధాన ఆలయం ముందున్న ఏడు పాయల్లో ఒకటైన నదీ పాయ ఉధృతంగా ప్రవహించడంతో అమ్మవారి ఆలయాన్ని తాత్కాలికంగా మూసివేసి రాజగోపురంలో అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ఏర్పాటు చేసి పూజలు నిర్వహించారు. మంగళవారం నీటి ప్రవాహం తగ్గడంతో ఆలయంలోని చెత్తా చెదారాన్ని శుభ్రం చేసి ఉదయం నుంచి అమ్మవారి దర్శనాన్ని పున: ప్రారంభించినట్లు ఆలయ అర్చకులు, అధికారులు తెలిపారు. భక్తులు, సందర్శకులు నది పాయల్లో తనివితీరా పుణ్య స్నానాలు ఆచరించి వనదుర్గామాత దర్శనానికి బారులు తీరారు. ఆలయ అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు.


Similar News