రోగులకు టెస్టులు త్వరగా చేయాలిః కలెక్టర్ రాహుల్ రాజ్

Update: 2024-08-14 12:30 GMT

దిశ, మెదక్ ప్రతినిధిః సర్కారు దవాఖానలో వైద్యులు సమన్వయంతో పని చేసి మెరుగైన వైద్యం అందించాలని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదేశించారు. మెదక్ జిల్లా ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని బుధవారం జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి, జిల్లా వైద్యాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆస్పత్రిలో రోగులతో మాట్లాడారు. వాళ్ల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. మెడికల్ స్టోర్ రూమును పరిశీలించి సిబ్బందిని మందుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వైద్యాధికారుల సమీక్ష సమావేశంలో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న అన్ని ప్రభుత్వ హాస్పిటల్లో వైద్యులు సమన్వయంతో పనిచేయాలన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న రోగుల సమాచారం హాస్పిటల్లో ఉండాలన్నారు. గ్రామం నుంచి వచ్చిన వ్యక్తికి త్వరగా పరీక్షలు చేసి పంపించాలన్నారు. ఆ గ్రామంలో మరొక వ్యక్తికి ఆ వ్యాధి రాకుండా చర్యలు తీసుకొని వెంటనే అవగాహన కార్యక్రమం తోపాటు వైద్య సిబ్బంది కూడా అందుబాటులో ఉండేలా సమన్వయంతో పని చేయాలన్నారు. ఆస్పత్రిలో ల్యాబ్ 24 గంటలు పని చేయాలన్నారు. త్వరగా రోగులకు ఫలితాలు అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల పరీక్షల ఫలితాలు త్వరగా అందించాలన్నారు. సీజనల్ వ్యాధుల పరీక్షలు ఆలస్యం చేయడం ద్వారా ఆ ప్రాంతంలో వ్యాధి అధికంగా సంక్రమించే ప్రమాదం ఉందన్నారు. పరీక్షల కిట్స్ అన్ని అందుబాటులో ఉండాలని ఏదైనా సమస్య ఉంటే తన దృష్టికి తేవాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో డిఎం హెచ్ ఓ శ్రీరామ్, ఆస్పత్రి సూపరిండెంట్ శివదయాళ్ వైద్యులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News