తప్పించుకున్న గంజాయి ముఠా..

జహీరాబాద్ ప్రాంతంలో గంజాయి దందా చేస్తున్న ముఠా పై పోలీసులు దాడులు నిర్వహించారు.

Update: 2024-09-16 14:11 GMT

దిశ, జహీరాబాద్ : జహీరాబాద్ ప్రాంతంలో గంజాయి దందా చేస్తున్న ముఠా పై పోలీసులు దాడులు నిర్వహించారు. ఐదుగురు ముఠా సభ్యుల్లో ఒకరిని పట్టుకోగా నలుగురు తప్పించుకున్నారు. కాగా వారి నుంచి 5 కిలోల గంజాయి పాకెట్లు స్వాధీనం చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను జహీరాబాద్ రూరల్ ఎస్సై.ప్రసాద్ తెలిపారు. జహీరాబాద్ మండలంలోని షేకాపూర్ తాండకు చెందిన రాథోడ్ హరి అలియాస్ అర్జున్ రాథోడ్, చౌహాన్ అర్జున్, చౌహాన్ విజయ్, పవర్ వేణు, చౌహాన్ సతీష్ అలియాస్ కిరణ్ వీరందరూ గత కొన్ని సంవత్సరాల నుంచి ఒరిస్సా బోర్డర్ ఏరియాలలోని కొత్తగూడెం, కర్ణాటక బీదర్ జిల్లా కేంద్రం నుండి నిషేధిత గంజాయి తీసుకొచ్చి జహీరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో దందా నిర్వహిస్తున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఆదివారం హుగ్గేల్లి గ్రామ శివారులోని షాలిమార్ హోటల్ వెనుక శిరీష వెంచర్ లో వీరందరూ కలిసి చిన్న చిన్న పాకెట్లుగా చేసి గంజాయి అమ్ముతున్నప్పుడు పోలీసు ఆకస్మిక దాడులు నిర్వహించారు.

వారిని చూసి అప్రమత్తమైన నలుగురు వ్యక్తులు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోగా రాథోడ్ హరి అలియాస్ అర్జున్ రాథోడ్ ను పట్టుకున్నారు. అతని వద్ద నుండి సుమారు 5 కిలోల గంజాయి పాకెట్లను స్వాధీనం చేసుకుని ఐదుగురు వ్యక్తులపై జహీరాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసునమోదు చేశారు. అరెస్ట్ చేసిన రాథోడ్ హరి అలియాస్ అర్జున్ రాథోడ్ ను సోమవారం రిమాండ్ కు తరలించారు. పరారీలో ఉన్న మిగతా నిందితులను త్వరలోనే పట్టుకుంటామన్నారు.


Similar News