ప్రమాదవశాత్తు కరెంట్ షాక్ తగిలి రైతు మృతి..

ప్రమాదవశాత్తు మొక్కజొన్న కాపలా కోసం ఏర్పాటు చేసిన వైరు తగిలి రైతు మృతి చెందిన సంఘటన నారాయణరావుపేట మండలం గోపులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది.

Update: 2024-09-18 15:50 GMT

దిశ, చిన్నకోడూరు : ప్రమాదవశాత్తు మొక్కజొన్న కాపలా కోసం ఏర్పాటు చేసిన వైరు తగిలి రైతు మృతి చెందిన సంఘటన నారాయణరావుపేట మండలం గోపులాపూర్ గ్రామంలో బుధవారం చోటుచేసుకుంది. చిన్నకోడూరు ఎస్సై బాలకృష్ణ తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన నీరుగొండ వెంకటయ్య (40) తన వ్యవసాయ పనులతో పాటు సెంట్రింగ్ వర్క్ చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. కాగా మంగళవారం సాయంత్రం తన వ్యవసాయ పొలం వద్దకు వెళ్లాడు. పొలం గట్ల వెంబడి తిరుగుతుండగా కాలుజారి అడవిపందుల కోసం ఏర్పాటు చేసిన కరెంటు వైర్ పై జారి పడటంతో విద్యుత్ ఘాతంతో రైతు వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. బుధవారం ఉదయం తండ్రి రాకపోయేసరికి తన కొడుకు వంశీ వ్యవసాయ పొలం వద్దకు వెళ్లి చూడగా పొలం గట్టు పై శవంగాపడి ఉన్నాడు.

విద్యుత్ షాక్ తగిలి చనిపోయి ఉంటాడని గమనించి, తల్లి మంగమ్మ కుటుంబ సభ్యులకు సమాచారం అందించాడు. మృతునికి ఒక కూతురు ప్రవళిక, కుమారుడు ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటన పై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు.


Similar News