‘దిశ’ ఎఫెక్ట్ .. నక్ష బాట కబ్జాపై విచారణ

జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామ పరిధిలోని 527 సర్వేనెంబర్ గల

Update: 2024-10-09 13:40 GMT

దిశ,జిన్నారం: జిన్నారం మండలంలోని ఊట్ల గ్రామ పరిధిలోని 527 సర్వేనెంబర్ గల భూమిలో ఊట్ల నుంచి మంగంపేట గ్రామాలను కలుపుతూ ఉన్న నక్షబాట కబ్జా విషయమై ‘దిశ’ దినపత్రికలో వరుస కథనాలు వెలువడుతున్నాయి. దీనికి స్పందించి బుధవారం జిల్లా పంచాయతీ అధికారి సాయిబాబా ఆదేశాల మేరకు ఊట్ల గ్రామపంచాయతీ కార్యదర్శి ప్రవీణ ఆధ్వర్యంలో ఐదుగురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు నక్షబాట విషయమై విచారణ చేపట్టారు. 527 సర్వేనెంబర్ లో చేపడుతున్న నిర్మాణాలు, నక్షబాట కు సంబంధించిన పత్రాలను అధికారులు పరిశీలించారు. అనంతరం పంచాయతీ కార్యదర్శి ప్రవీణ మాట్లాడుతూ 527 సర్వే నంబర్ లో రికార్డుల ప్రకారం నక్షబాట ఉందన్నారు. రెవెన్యూ అధికారులు ఇచ్చిన సమాచారంతో పాటు, తాము సేకరించిన వివరాలను జిల్లా పంచాయతీ అధికారికి అందిస్తామని వివరించారు.

రెవెన్యూ అధికారులు విచారణ జరపకపోవడం పై అనుమానాలు..

రెండు గ్రామాలను కలుపుతూ ఉన్న నక్ష బాట కబ్జాకు గురైన విషయం రెవెన్యూ అధికారులకు తెలిసిన ఇటువైపు చూడడం లేదు. నక్షబాట కబ్జా విషయమై స్థానికులు రెవెన్యూ అధికారులకు చాలాసార్లు ఫిర్యాదు చేశారు. హెచ్ఎండీఏ అనుమతులు ఉన్నాయని తెలుపుతూ అధికారులు ఎలాంటి విచారణ జరపడం లేదు. దీంతో రెవెన్యూ అధికారుల తీరుపై ఆయా గ్రామాల ప్రజలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా రెవెన్యూ అధికారులు స్పందించి నక్ష బాట పై పూర్తిస్థాయి విచారణ జరిపి రెండు గ్రామాల ప్రజలు, రైతులకు న్యాయం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు రెవెన్యూ అధికారులను కోరుతున్నారు.


Similar News