Harish Rao : అబద్దాలకే కాంగ్రెస్ అంబాసిడర్

అబద్దాలకే కాంగ్రెస్ అంబాసిడర్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు.

Update: 2024-10-20 16:30 GMT

దిశ, సిద్దిపేట ప్రతినిధి : అబద్దాలకే కాంగ్రెస్ అంబాసిడర్ అని మాజీ మంత్రి ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు అన్నారు. గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. మూసీ ప్రక్షాళన పేరిట కేసీఆర్ కట్టించిన ఇండ్లు సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితులకు ఇవ్వడం సిగ్గు చేటు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి నిర్వాసితులపై ప్రేమ ఉంటే గచ్చిబౌలి లో 250 గజాల స్థలంలో ఇల్లు కట్టించి ఇవ్వాలని సవాల్ విసిరారు. ప్రాజెక్టుల నిర్మాణం తో మాజీ సీఎం కేసీఆర్ నిర్వాసితులకు అన్యాయం చేసిండో..? లేక మూసీ ప్రక్షాళన పేరిట సీఎం రేవంత్ రెడ్డి నిర్వాసితులకు అన్యాయం చేస్తూన్నారో ప్రజలే నిర్ణయిస్తారని అన్నారు. భూములు కోల్పోయిన నిర్వాసితులకు 675 ఎకరాలలో ఇండ్లు కట్టించి ఇచ్చిన ఘనత మాజీ సీఎం కేసీఆర్ కే దక్కుతుందని అన్నారు. అదే విధంగా భూ నిర్వాసితులకు మెరుగైన ప్యాకేజీ అందించినట్లు స్పష్టం చేశారు.

మల్లన్న సాగర్ నిర్వాసితులకు ఇండ్లు ఇవ్వలేదని సీఎం రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్తుండడం సరికాదన్నారు. తునికి బొల్లారంలో 400 ఎకరాల్లో భూ నిర్వాసితుల కోసం ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. వర్గల్ లో పరిశ్రమలు రాకుండా కాంగ్రెస్ నేతలు అడ్డుపడుతున్నట్లు ఆరోపించారు. నిర్వాసితులను తప్పుదారి పట్టించడం కాకుండా వివిధ కారణాలతో మిగిలిన వారికి నష్ట పరిహారం, ప్యాకేజీలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ డాక్టర్ వంటేరు యాదవ రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి సంస్థ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాపరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ జకీయోద్ధిన్, మాజీ జెడ్పిటిసి డాక్టర్ మల్లేశం, ఆయా మండలాల పార్టీ బాధ్యులు బెండ మధు, వేలూరి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


Similar News