Collector : హోంగార్డ్ గోపాల్ కు మెరుగైన చికిత్స

క్రమ నిర్మాణం కూల్చివేత సమయంలో ప్రమాదానికి గురైన హోంగార్డు కు మెరుగైన చికిత్స అందుతుందని, ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి చెప్పారు.

Update: 2024-10-02 12:45 GMT

దిశ, సంగారెడ్డి బ్యూరో: అక్రమ నిర్మాణం కూల్చివేత సమయంలో ప్రమాదానికి గురైన హోంగార్డు కు మెరుగైన చికిత్స అందుతుందని, ప్రభుత్వమే ఖర్చులు భరిస్తుందని సంగారెడ్డి జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి చెప్పారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువు వద్ద అక్రమ కట్టడాల కూల్చివేత సమయంలో అనుకోకుండా జరిగిన ప్రమాదంలో హోంగార్డ్ గోపాల్‌కు గాయాలు అయిన విషయం తెలిసిందే. కాగా బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి, ఎస్పీ రూపేష్ ఆసుపత్రి లో గోపాల్ ను పరామర్శించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన రోజే ఎస్పీ రూపేష్ అతన్ని గచ్చిబౌలిలోని ఏజీ ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. గోపాల్‌కు అందుతున్న చికిత్సపై ఆసుపత్రి చైర్మన్, డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో మాట్లాడారు. గోపాల్‌కు మెరుగైన వైద్యం అందించాలని జిల్లా కలెక్టర్ సూచించారు. ఆసుపత్రి వైద్యులు గోపాల్ త్వరగా కోలుకుంటారని, రెండు రోజుల్లో డిశ్చార్జ్ అయ్యే అవకాశం ఉందని వివరించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు హోంగార్డు గోపాల్‌కు జరిగే అన్ని వైద్య ఖర్చులు ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ తెలిపారు.

ఆసుపత్రి యాజమాన్యం తో, న్యూరో సర్జన్ డాక్టర్ లతో జిల్లా వైద్యాధికారులు ఎప్పటికప్పుడు చర్చలు జరిపి, గోపాల్ ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటూ ఆయనకు అవసరమైన అన్ని చికిత్సలు అందేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. గోపాల్ పూర్తి ఆరోగ్యానికి అవసరమైన అన్ని సేవలను ప్రభుత్వం అందిస్తుందని స్పష్టం చేశారు. అతనికి అవసరమైన స్పీచ్ థెరపీ, ఫిజియోథెరపీ వంటి సదుపాయాలు కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేస్తుందన్నారు. ప్రభుత్వం వారి కుటుంబాన్ని అన్ని విధాల ఆదుకుంటుందని, గోపాల్ ఆరోగ్యంపై ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ, ఆయన పూర్తిగా కోలుకునే వరకు అన్ని సౌకర్యాలు అందిస్తామని స్పష్టం చేశారు. జిల్లా ఎస్పీ రూపేష్ మాట్లాడుతూ.. గోపాల్ ఆరోగ్య విషయమై ఎస్ఐ స్థాయి అధికారిచే నిత్యం పర్యవేక్షిస్తూ, ఎప్పటికప్పుడు అతని ఆరోగ్య పరిస్థితిని తెలుసుకుంటున్నామని పోలీసు శాఖ అతనికి అన్ని రకాలుగా అండగా ఉంటుందని, సిబ్బంది సంక్షేమానికి మొదటి ప్రాధాన్యం ఇస్తామని జిల్లా ఎస్పీ చెప్పారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారిణి గాయత్రి, ఏఐజీ ఆస్పత్రి వైద్యులు, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.


Similar News