పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ: గూడెం మహిపాల్ రెడ్డి

పటాన్ చెరులో సద్దుల బతుకమ్మ వేడుకలు సంబురంలా సాగాయి.

Update: 2024-10-10 14:52 GMT

దిశ,పటాన్ చెరు : పటాన్ చెరులో సద్దుల బతుకమ్మ వేడుకలు సంబురంలా సాగాయి. సాకి చెరువు ప్రాంగణం బతుకమ్మ ఆటపాటలతో మారుమోగిపోయింది. పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని సాకి చెరువు కట్టపై అద్భుతమైన ఏర్పాట్లు చేశారు. గురువారం సాయంత్రం ఏర్పాటు చేసిన సద్దుల బతుకమ్మ సంబరాల్లో వేలాదిమంది మహిళలు తమ బతుకమ్మలతో హాజరయ్యారు. ప్రముఖ జానపద గాయని రేలారే రేలా గంగా ఆధ్వర్యంలోని బృంద సభ్యులు ఆలపించిన బతుకమ్మ గీతాలకు అనుగుణంగా మహిళలు బతుకమ్మ ఆడారు. బిత్తిరి సత్తి హాస్యం అందరినీ అలరించింది.


ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రపంచంలో ప్రకృతిని ప్రేమిస్తూ..పూలను పూజించే అరుదైన పండుగ బతుకమ్మ పండుగ అన్నారు. పటాన్ చెరు నియోజకవర్గం నుండి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించడంలో పటాన్ చెరు పట్టణ ప్రజల సహకారం, మద్దతు అత్యంత కీలకమన్నారు. పటాన్ చెరు ప్రజలకు జీవితాంతం తమ కుటుంబం రుణపడి ఉంటుందని తెలిపారు. గత 12 సంవత్సరాలుగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తూ ప్రతి ఒక్కరి ఆనందంలో పాలుపంచుకుంటున్నామని తెలిపారు. భవిష్యత్తులోనూ పట్టణ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని తెలిపారు.


అనంతరం ఉత్తమ బతుకమ్మల కు నగదు బహుమతులు అందజేశారు. ప్రథమ బహుమతిరూ. 25 వేలు, ద్వితీయ బహుమతి రూ.20 వేలు, తృతీయ బహుమతి రూ. 15 వేలను విజేతలకు అందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కుమార్తె, కోడలు, మనుమరాల్లు మహిళలతో కలిసి బతుకమ్మ ఆడి అందరినీ ఉత్సాహపరిచారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ విజయ్ కుమార్, మాజీ కార్పొరేటర్ సపాన దేవ్, గూడెం మధుసూదన్ రెడ్డి, మాజీ ఎంపీపీ యాదగిరి యాదవ్, బల్దియా డిప్యూటీ కమిషనర్ సురేష్, పట్టణ పుర ప్రముఖులు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.


Similar News