హైవేలపై అండర్ పాస్‌లు.. రోడ్డు ప్రమాదాలకు ఇక చెక్!

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న జాతీయ రహదారి-44పై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది.

Update: 2024-09-23 03:43 GMT

దిశ, మహబూబ్‌నగర్ బ్యూరో: ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న జాతీయ రహదారి-44పై ప్రమాదాల నివారణకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కొత్తూరు నుంచి అలంపూర్ చౌరస్తా వరకు ఉన్న 144 జాతీయ రహదారి విస్తరణ అనంతరం కొన్ని గ్రామాల వద్ద రోడ్డు ప్రమాదాలు అనేకం జరుగుతండటంతో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలువురు కలెక్టర్లు, ఎస్పీలు, ఇతర అధికారులు ఇచ్చిన విజ్ఞప్తుల మేరకు అత్యవసర బ్లాక్ స్పాట్లను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికలను పంపించారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఉన్న దాదాపుగా 300 కి.మీ పొడవు జాతీయ రహదారిపై పలు గ్రామాల వద్ద అండర్ పాస్‌లు లేక పెద్ద ఎత్తున ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆయా ఉమ్మడి పాలమూరు జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు ప్రమాదభరితంగా ఉన్న గ్రామాలు, ఆ ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఉన్నతాధికారులకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఎన్‌హెచ్-44 రోడ్డు విస్తరణతో పాటు ప్రమాదాల నివారణకు అత్యవసర బ్లాక్ స్పాట్‌లను గుర్తించి కేంద్ర ప్రభుత్వానికి నివేదికను పంపారు.

ఆ నాలుగు గ్రామాలు ప్రమాదకరం

ఉమ్మడి పాలమూరు జిల్లాలో జాతీయ రహదారిపై ప్రమాదాల నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఉమ్మడి పాలమూరు జిల్లాలోని భూత్పూర్ మండలం శేరిపల్లి‌(బి), అడ్డాకుల మండలం వేముల, జానంపేట, కొత్తకోట మండలం కన్మెట్ట తదితర ప్రాంతాలను అత్యధిక ప్రమాదాలు చోటుచేసుకుంటున్న ప్రదేశాలుగా గుర్తించారు. ఆయన జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు స్వయంగా పరిశీలించి వివరాలను కేంద్ర ప్రభుత్వానికి తెలిపారు.

మరోవైపు విస్తరణకు సన్నద్ధం

జాతీయ రహదారి-144‌పై రోడ్డు నిర్మాణాల కోసం ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోంది. ఇప్పటికే నాలుగు లైన్లుగా ఉన్న రోడ్డును ఒకవైపు విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. రోడ్డు విస్తరణ పనులకు సన్నద్ధం అవుతూనే ఆయా గ్రామాల వద్ద ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకోనుంది.


Similar News