Water plant : మినరల్ మాయ..!

ప్రస్తుత జీవనశైలిలో ప్రజలందరూ ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి అలవాటుపడ్డారు.

Update: 2024-10-28 02:03 GMT

దిశ, వనపర్తి టౌన్ : ప్రస్తుత జీవనశైలిలో ప్రజలందరూ ప్యూరిఫైడ్ వాటర్ తాగడానికి అలవాటుపడ్డారు. ఆరోగ్యం కోసమని తాగుతున్న మినరల్ వాటర్ తర్వాత రోజుల్లో అనారోగ్యాల బారిన పడేలా చేస్తోందని నిపుణులు పేర్కొంటున్నారు. వనపర్తి జిల్లాలో ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ ( Water plant ) లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. జననివాసాల మధ్య వేల ఫీట్ల లోతులో బోరువేసి, నిబంధనలు పాటించకుండా ప్లాంట్ లు ఏర్పాటు చేసి సొమ్ము చేసుకుంటున్నారు. ప్యూరిఫైడ్ వాటర్ పేరుతో తూతూమంత్రంగా బోరు నీటిలో కొన్ని కెమికల్ కలిపి నీరు సరఫరా చేస్తున్నారు. నిబంధనలు పాటించని వాటర్ ప్లాంట్స్ పై అధికారులు తనిఖీలు నిర్వహించి అన్ని పోషక విలువలతో కూడిన మిశ్రమాలు, లవణాలు కలిగి ఉన్నాయని నిర్ధారించి చెప్పే పరిస్థితుల్లో అధికారులు లేరనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంతో పాటు గ్రామీణ ప్రాంతాల్లోనూ నిబంధనలు పాటించకుండా వాటర్ ప్లాంట్లు ఏర్పాటు చేసి ప్రజల ఆరోగ్యాలతో ( Health చెలగాటమాడుతున్నారు.

బీఐఎస్ నిబంధనలకు మంగళం..

ఒక ప్లాంట్ ఏర్పాటు కోసం సుమారుగా రూ.30 లక్షలు నుంచి రూ.40 లక్షల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. నాణ్యమైన పాలిథిలిన్, పాలీ ఫ్రాఫలైన్ తో తయారు చేసిన నీటి డబ్బాలు మాత్రమే వాడాలి. నిత్యంనీటిని నాణ్యత పరిశీలించేందుకు కెమిస్ట్రీ ల్యాబ్ పరికరాలను ఏర్పాటు చేసుకోవాలి. ఇదేంలేకుండా ఒక రేకుల షెడ్డు, సింథటిక్ ట్యాంక్స్, రూ.2 లక్షలతో నీటిశుద్ధి యంత్రంలో ప్లాంట్ ఏర్పాటు చేస్తున్న దుస్థితి నెలకొన్నది. నిబంధనల ప్రకారం పదిసార్లకు పైగా చేయాల్సిన శుద్ధి ప్రక్రియను నాణ్యతలేని రసాయనాలను వాడి 1, 2 సార్లు శుద్ధి చేసి డబ్బాలు నింపుతున్నారు. చౌక రసాయనాలు వాడి 20 లీటర్ల డబ్బాను రూ.5 నుంచి రూ.25 వరకు విక్రయిస్తున్నారు.

కలుషితంగా నీటి సరఫరా డబ్బాలు..

రెండు, మూడు దశల్లో కడగాల్సిన నీటి డబ్బాలను కడగకుండానే ఆటో ట్రాలీలో ఉంచి వాటర్ నింపుతున్నారని తెలుస్తోంది. వాటిని హోటల్లో గృహ సముదాలకు దుకాణాలకు సరఫరా చేస్తున్నారు. అక్కడ నీటిని వాడేలోపు మరోరోజు నిల్వ ఉండడంతో నీటిలో సూక్ష్మజీవులు ఉత్పన్నమై తాగిన వారికి ఆరోగ్యం దెబ్బతింటుంది. ఇప్పటికే వైద్య నిపుణులు మినరల్ వాటర్ తాగడంతో మోకాళ్ల నొప్పులు వస్తూ తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని ఎన్నో సందర్భాల్లో తెలియజేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఎంత మోతాదులో రసాయనాలు కలపాలో తెలియకపోవడంతో వారు చేసే తప్పిదాల వల్ల ప్రజలకు గొంతు కీళ్ల నొప్పులు శరీరం తేమ కూలిపోవడం, జీర్ణ వ్యవస్థకు సంబంధించిన వ్యాధులు వస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు.

అధికారు పర్యవేక్షణ ఎందుకు లేదో..?

నిబంధనలు పాటించకుండా ఏర్పాటుచేసిన వాటర్ ప్లాంట్స్ పై అధికారుల దృష్టి కరువైంది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న ప్యూరిఫైడ్ వాటర్ ప్లాంట్ నిర్వాహకులను కట్టడి చేయాలని నీటి శుద్ధి ప్రక్రియ చేయకుండా నిర్వహిస్తున్న ప్లాంట్లను తనిఖీ చేసి బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ నాణ్యత ప్రమాణాలను అతిక్రమించి నిర్వహిస్తున్న వారిపై కఠినచర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

Tags:    

Similar News