హడలెత్తిస్తున్న హైడ్రా.. బఫర్ జోన్ లో వందలాది ఇళ్ల స్థలాలు

బఫర్ జోన్ లో వందలాది ఇళ్ల స్థలాలు

Update: 2024-09-10 03:44 GMT

దిశ ప్రతినిధి, వనపర్తి: రియల్ ఎస్టేట్ వ్యాపారుల దెబ్బకు వనపర్తి జిల్లా కేంద్రంలోని చెరువులన్నీ చిన్న బోయాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రానికి శిరస్సుగా భావించే నల్లచెరువు ఎఫ్ టీఎల్ పరిధిలో వందలాది ప్లాట్లు విక్రయించడంతో చెరువే తెల్ల ముఖం వేసినట్లయింది. తాళ్ళచెరువు, మర్రికుంట, అమ్మ చెరువులో సైతం చాలా భాగం ప్లాట్లు బఫర్ జోన్లలో ఉన్నట్టు సమాచారం. ఈ నాలుగు చెరువులను గత ప్రభుత్వం రిజర్వాయర్లుగా మార్చి మినీ ట్యాంకుబండ్లుగా నిర్మించింది. అయితే అప్పట్లో ఎఫ్ టీ ఎల్ నిర్దేశించడంతో పెద్ద మొత్తంలో ప్లాట్లు బఫర్ జోన్ లో ఉన్నట్టుగా తేలింది. అయితే కొంతమేర అలుగు పరిమాణం తగ్గించడంతో ఇళ్లస్థలాలు కొనుగోలు చేసిన వారు భరోసాతో ఉన్నారు. కానీ ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా ను తెరపైకి తీసుకురావడంతో ప్లాట్లు కొనుగోలు చేసిన లబ్ధిదారులు ఆందోళనలో పడ్డారు.

నల్లచెరువు చుట్టూ..

వనపర్తి జిల్లా కేంద్రం నుంచి హైదరాబాద్ వైపు వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న నల్లచెరువు చుట్టుపక్కల వెంచర్లు వేసి వందలాది ప్లాట్లను విక్రయించారు. వాయిదాల పద్ధతిలో అధిక శాతం మంది మధ్యతరగతికి చెందినవారు భవిష్యత్తులో సొంత ఇంటి నిర్మాణం కోసం అంటే స్థలాలను కొనుగోలు చేశారు. అలాగే పానగల్ రోడ్డు పక్కన ఉన్న పెద్దమందడి రహదారి పక్కన ఉన్న అమ్మ చెరువు పెబ్బేరు రహదారి అనుసరించి ఉన్న మర్రికుంట ప్రాంతాలలో సైతం రియల్ ఎస్టేట్ వ్యాపారులు వెంచర్లు వేసి ప్లాట్లు విక్రయించారు. అప్పట్లో డీటీసీపీ లేఅవుట్ విధానం అమలులో లేకపోవడంతో రియల్ వ్యాపారులు తమకు లాభాలు వచ్చేలా చిన్న సైజు రోడ్లను వేసి అధిక మొత్తం ప్లాట్లను రూపొందించి సొమ్ము చేసుకున్నారు. చిన్నాచితక వ్యాపారాలు , మధ్య తరగతి కుటుంబాల వారు ఆయా వెంచర్లలో ఇంటి స్థలాలను కొనుగోలు చేసి పెట్టుకున్నారు. రియల్ వ్యాపారులు తాము వేసిన ప్లాట్లు అన్నింటిని విక్రయించుకొని పత్తా లేకుండా పోయారు.

రిజర్వాయర్లుగా మారడంతో..

గతంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జిల్లా కేంద్రంలోని చెరువులన్నింటినీ రిజర్వాయర్లుగా మార్చారు. ప్రధానమైన నల్లచెరువు, తాళ్లచెరువు, అమ్మ చెరువు, మరికుంటలకు కోట్లాది రూపాయలను వెచ్చించి మినీ ట్యాంక్ బండ్లను సైతం నిర్మించారు. ఆ సమయంలో ఎఫ్ టీఎల్ బౌండరీ ని నిర్దేశించగా నల్లచెరువు పరిధిలో వందలాది ప్లాట్లు ఎఫ్ టీ ఎల్ లో ఉన్నట్టు బయటపడింది. అదేవిధంగా మర్రి కుంట , తాళ్లచెరువు, అమ్మ చెరువు పరిధిలో సైతం అనేక ప్లాట్లు బఫర్ జోన్ లో ఉన్నట్లుగా అధికారులు గుర్తించారు. దీంతో ఆందోళన గురైన బాధితులు అప్పటి మంత్రి నిరంజన్ రెడ్డిని కలిసి తమ గోడు వెలబోసుకోగా కొంత మేరకు అలుగు ప్రమాణాన్ని తగ్గించడంతో చాలామంది బాధితుల ప్లాట్లకు ఇక్కట్లు తొలిగాయి. మిగిలిపోయిన బాధితులు సైతం తమకు ప్లాట్లు విక్రయించిన వారిపై కోర్టులో కేసులు వేశారు. తమకు ఎలాగైనా న్యాయం జరుగుతుందని ఆశలు ఉండగా రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తీసుకురావడంతో చెరువుకుంటల ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్న నివాసాలను కూల్చి వేస్తున్నారు. దీంతో మర్రికుంటలో ఇండ్లు నిర్మించుకున్న వారు చెరువుల ప్రాంతాలలో కలిగి ఉన్నవారు కంటిమీద నిద్ర లేకుండా ఆందోళనతో కాలం గడుపుతున్నారు.

అధికారుల నిర్లక్ష్యంతో..

రోజు కష్టం చేస్తే తప్ప పూట గడవని దిగువ తరగతి వారు, చిన్నాచితకా ఉద్యోగాలు, వ్యాపారాలు చేసి జీవించే మధ్యతరగతి కుటుంబాలకు చెందిన వారందరం కూడబెట్టుకున్న డబ్బులతో ఇండ్ల స్థలాలను కొనుగోలు చేశారు. ఇప్పుడు అవన్నీ బఫర్ జోన్ లో ఉన్నాయని ప్రభుత్వం తిరిగి తీసుకుంటుందని చెప్పడం సబబు కాదని బాధితులు వాపోతున్నారు. అసలు దీనికంతటికి కారణం ప్రభుత్వ ఉదాసీన వైఖరి, అధికారుల నిర్లక్ష్యమేనని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతి చెరువులు, కుంటల దగ్గర ముందస్తుగానే అధికారులు ఎఫ్ టీ ఎల్ బౌండరీని ఏర్పాటు చేసి ఈ పరిధిలో ప్లాట్లు కొన్నా, భవనాలు కొన్నా చెల్లబడువు అని బోర్డులు ఏర్పాటు చేసి ఉంటే మావంటి పేదలు స్థలాలను కొనుగోలు చేసే వారమే కాదని బాధితులు బాహాటంగానే విమర్శిస్తున్నారు. తమకు ప్లాట్లు విక్రయించిన వ్యాపారులపై కోర్టుకు వెళ్తామని చెప్తున్నారు. మరోవైపు పట్టాలు కలిగి ఉన్న రైతుల దగ్గరే తాము భూములు కొనుగోలు చేసి ప్లాట్లు వేసినట్టు రియల్ వ్యాపారులు చెప్తున్నారు. మేము కూడా అట్టి రైతులపై కేసులు వేస్తామని బాధితులకు వివరిస్తున్నారు. ఏది ఏమైనా అధికారులు నాడు చేసిన నిర్లక్ష్యం వల్ల తమ వంటి వారందరం నష్టపోతున్నామని వాపోయారు. ప్రభుత్వం దీన్ని గుర్తించి ప్లాట్లను కొని నష్టపోయిన బాధితులను ఆదుకోవాలని, అట్టి స్థలాలను వారికే క్రమబద్ధీకరించాలని వారు కోరుతున్నారు.

హైడ్రా కమిషనర్ ప్రకటనతో ఊరట..

రాష్ట్ర మంతటా చెరువుల, కుంటల పరిధిలో అక్రమణ కట్టడాలను హైడ్రా కూల్చి వేస్తుండడంతో ఆయా జిల్లాల్లో సైతం బాధితులు తీవ్ర ఆందోళనలో పడ్డారు. మొన్నటికి మొన్న మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో సైతం ఎఫ్ టీ ఎల్ పరిధిలో ఉన్న ఇండ్లను రాత్రికి రాత్రి కూల్చి వేయడంతో ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతోంది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ ఎఫ్ టీ ఎల్, బఫర్ జోన్లలో ఇండ్లను నిర్మించుకొని నివాసాలు ఉన్న ఎడల వాటిని కూల్చివేయమని, అట్టి నిర్మాణాలపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని ప్రకటించారు. దీంతో వనపర్తి జిల్లా కేంద్రంలో సైతం ఆ చెరువులో ఎఫ్టీఎల్ పరిధిలో ఇండ్లను నిర్మించుకొని నివాసాలు ఉన్న ప్రజలు కొంత ఊరట చెందారని చెప్పవచ్చు.

Tags:    

Similar News