సీఎం సొంతూరు కు రాక సందర్భంగా సర్వం సిద్ధం..

ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు ఎలాగో అన్నట్లుగా పుట్టినూరు కన్న తల్లితో సమానం అన్నట్లుగా..

Update: 2024-10-11 12:02 GMT

దిశ, అచ్చంపేట/వంగూరు: ఢిల్లీకి రాజైన తల్లికి కొడుకు ఎలాగో అన్నట్లుగా పుట్టినూరు కన్న తల్లితో సమానం అన్నట్లుగా.. సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి తన స్వగ్రామమైన నాగర్ కర్నూల్ జిల్లా వంగూరు మండలం కొండారెడ్డి పల్లి గ్రామానికి దసరా పండుగ సందర్భంగా శనివారం సాయంత్రం ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా చేరుకోనున్నారు. తన రాజకీయ ప్రస్థానం మొదలైన నాటి నుంచి సీఎం రేవంత్ రెడ్డి ఎక్కడ ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా దసరా పండుగకు తన సొంత ఊరికి వచ్చి గ్రామస్తులతో పండుగ వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీ. కానీ నేడు సీఎం హోదాలో రేవంత్ రెడ్డి రానుండడంతో గ్రామంలో పండగ వాతావరణం పతాక స్థాయికి చేరుకుంది. సీఎం పర్యటన సందర్భంగా జిల్లా అధికార యంత్రాంగం గత నెల రోజుల నుండి గ్రామంలో ప్రత్యేక రివ్యూ సమావేశాలు అభివృద్ధిపై సమీక్షలు చేస్తూ అన్ని ఏర్పాట్లను సవ్యంగా చేసేలా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూ పనులు చేపడుతున్నారు.

రూ. 50 కోట్లతో అభివృద్ధి పనులు..

కొండారెడ్డి పల్లి గ్రామంలో రూ 50 కోట్ల నిధులతో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి. అందుకు సంబంధించి శనివారం సీఎం రేవంత్ రెడ్డి అభివృద్ధి ప్రారంభిస్తూ శంకుస్థాపనకు శ్రీకారం చుట్టనున్నారు. బీసీ కమ్యూనిటీ హాల్ నూతన గ్రామ పంచాయతీ, పశు వైద్య భవనం, నూతన గ్రంథాలయ భవనం, ఆధునికరణతో రైతు వేదిక, ప్రతి ఇంటికి సోలార్ విద్యుత్ తదితర అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. అలాగే గ్రామంలో అండర్ డ్రైనేజ్, నాలుగు లైన్ల రోడ్డు, సెంటర్ లైటింగ్, పిల్లల కోసం పార్కు, జిమ్, గుడి తదితర పరులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు. సీఎం పర్యటన సందర్భంగా అన్ని శాఖల అధికారులతో సమన్వయం చేస్తూ అధికారులు ప్రతి ఇంటిని సందర్శించి ఏర్పాట్లు చూస్తున్నారు.

పటిష్ట భద్రతా చర్యలు..

సీఎం రేవంత్ రెడ్డి తన స్వగ్రామానికి వస్తున్న నేపథ్యంలో సీఎం ప్రత్యేక భద్రత అధికారి.. జిల్లా కలెక్టర్ బాదావత్ సంతోష్, ఎస్పీ వైభవ్ గైక్వాడ్ శుక్రవారం మరోసారి ఇతర శాఖల అధికారులతో కలిసి పర్యవేక్షించారు. తదుపరి హెలిపాడ్ ప్రదేశం, జమ్మికి గ్రామస్తులతో కలిసి వెళ్లే ప్రదేశం, గ్రామంలో ఎక్కడెక్కడ పర్యటన చేయనున్నారో ఆ ప్రదేశాలను మొత్తం పోలీసుల ఆధీనంలోకి ముందుగానే తీసుకోనున్నారు. సీఎంను కలిసేందుకు పెద్ద మొత్తంలో ప్రజాప్రతినిధులు వచ్చే అవకాశం ఉన్నందున భద్రతా లోపాలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అలాగే ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు, ఇతర ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించి పోలీసులకు తగిన సూచనలు చేశారు. సీఎం రేవంత్ రెడ్డి తిరిగి వెళ్లే వరకు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ సూచించారు.


Similar News