Mahender Reddy: అధికారులు నిర్ధారిస్తే నేనే దగ్గరుండి కూల్చివేస్తా

నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి ఫామ్ హౌజ్ ఉన్నా కూల్చి వేయాల్సిందేనని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు.

Update: 2024-10-04 14:29 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: నిబంధనలకు విరుద్ధంగా ఎవరికి ఫామ్ హౌజ్ ఉన్నా కూల్చి వేయాల్సిందేనని శాసనమండలి చీఫ్ విప్ పట్నం మహేందర్ రెడ్డి స్పష్టం చేశారు. సచివాలయం మీడియా పాయింట్‌లో శుక్రవారం ఆయన మాట్లాడారు. మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి నా ఫామ్ హౌస్ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉందని ఆరోపిస్తున్నారని మండిపడ్డారు. నా ఫామ్ హౌజ్ రూల్స్ ప్రకారం ఉందని స్పష్టం చేశారు. రూల్ ప్రకారం లేదంటే అప్పుడు మీరు కూడా రండి నేనే దగ్గర ఉండి కూల్చివేస్తానని వెల్లడించారు. ప్రతీ సారి నా పేరు తీసుకుని విమర్శలు చేస్తున్నారని, నేను కూడా మంత్రిగా పని చేసిన అనుభవం ఉన్న ఒక బాధ్యత గల వ్యక్తిని అన్నారు. నిబంధనల మేరకే ఫామ్ హౌజ్ ఉందని అధికారులు నాకు నివేదిక కూడా ఇచ్చారన్నారు.

అందుకు సంబంధించిన మ్యాప్‌ను కూడా మీడియాకు చూపారు. ఎఫ్‌టీ‌ఎల్, బఫర్ జోన్‌లో నా ఫాంహౌజ్ నిర్మాణం చేయలేదని వివరించారు. రింగ్ రోడ్డు మీద నుంచి చూస్తే గుట్టల మీద ఉంటది.. దాని పక్కనే నీళ్ళు ఉన్నట్లు కనిపిస్తోందని, 20 ఏళ్ల క్రితమే ఫాం హౌజ్ నిర్మించానన్నారు. 111 జీఓ అనేది సుప్రీంకోర్టు పరిధిలో ఉందని తెలిపారు. అధికారుల నుంచి నాకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌజ్‌కు పర్మిషన్ ఉందా? లేదా అనేది అధికారులు చూసుకుంటారని అన్నారు. సబితా ఇంద్రారెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇద్దరికి నా ఫామ్ హౌజ్ పక్కనే ఫామ్ హౌజ్‌లు ఉన్నాయని తెలిపారు.


Similar News