కేటీఆర్‌కు లీగల్ నోటీస్.. పది రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని డెడ్‌లైన్

ప్రవళిక ఆత్మహత్యపై గతేడాది అక్టోబరు 20న కామెంట్లు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లీగల్ నోటీసు జారీ అయింది.

Update: 2024-04-04 17:17 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ప్రవళిక ఆత్మహత్యపై గతేడాది అక్టోబరు 20న కామెంట్లు చేసిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు లీగల్ నోటీసు జారీ అయింది. పది రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని, లేనట్లయితే కోర్టు ద్వారానే తేల్చుకోనున్నట్లు ఆ నోటీసులో న్యాయవాది కరణం రాజేశ్‌కుమార్ పేర్కొన్నారు. గ్రూపు-2 పోస్టు కోసం దరఖాస్తు చేసుకున్న ప్రవళిక రెండుసార్లు పరీక్షలు వాయిదా పడడంతో మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నదని, కానీ ఆమె సూసైడ్‌ను ప్రేమ వ్యవహారంతో ముడిపెట్టి అప్పట్లో మంత్రిగా ఉన్న కేటీఆర్ బాధ్యతారాహిత్యంగా మీడియా ద్వారా కామెంట్లు చేశారని లాయర్ ఆ నోటీసులో పేర్కొన్నారు. ఎలాంటి ఆధారాలు లేకుండా ప్రేమ వ్యవహారమని వ్యాఖ్యానించడం, గ్రూపు-2 పోస్టు కోసం దరఖాస్తే చేసుకోలేదని వ్యాఖ్యానించడం, వాటికి ఎలాంటి ఆధారాలు చూపలేకపోవడాన్ని లాయర్ ప్రస్తావించారు.

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య 2.3% పెరిగిందంటూ ఐఎల్ఓ నివేదికలో పేర్కొన్నదని, గ్రామీణ-పట్టణ తారతమ్యం లేకుండా ఉపాధి కల్పనపై దృష్టి పెట్టి ఈ సమస్యను పరిష్కరించడానికి మంత్రి హోదాలో చొరవ తీసుకోలేదని, మానసిక క్షోభకు గురై ఆత్మహత్య చేసుకున్నవారిపై కామెంట్లు చేయడాన్ని తప్పపట్టారు. మానవీయ దృక్పథంతో వ్యవహరించడానికి బదులు రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి వ్యాఖ్యానాలు చేశారని ఆరోపించారు. అధికారంలో ఉండి కూడా నిరుద్యోగ సమస్యను పరిష్కరించలేకపోయారన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల కోసం నిరుద్యోగ విద్యార్థుల కోచింగ్‌, ఆకలి, వసతి సౌకర్యాలు, ఆర్థిక అవసరాలకు పడుతున్న ఇబ్బందులపై అప్పట్లో మంత్రిగా కేటీఆర్‌కు ప్రాక్టికల్ అవగాహన లేదన్నారు.

సూసైడ్ చేసుకున్న విద్యార్థిని సమస్యను లోతుగా అర్థం చేసుకోడానికి బదులుగా ప్రేమ విఫలమైందని... గ్రూపు-2 పోస్టుకు దరఖాస్తే చేసుకోలేదని మీడియా ద్వారా కామెంట్లు చేయడం వాస్తవాన్ని తప్పుదారి పట్టించడమేనని లాయర్ ఆ నోటీసులో ప్రస్తావించారు. బాధ్యతాయుతమైన స్థానంలో ఉండి రాజ్యాంగ విరుద్ధమైన, ప్రజాస్వామిక స్ఫూర్తికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయడం సమాజానికి తప్పుపు మెసేజ్ పంపించినట్లయిందన్నారు. ఈ నోటీసులో పేర్కొన్న పది పాయింట్లకు పది రోజుల్లోగా రిప్లై ఇవ్వాలని లేదంటే కోర్టు ద్వారా జరిగే న్యాయపోరాటానికి సిద్దం కావాలని స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం మదనపల్లి గ్రామానికి చెందిన ములుగాసి శివకుమార్ తరఫున ఈ నోటీసును జారీ చేస్తున్నట్లు లాయర్ కరణం రాజేశ్ కుమార్ పేర్కొన్నారు.

Tags:    

Similar News