‘ఎవడి చావు వాడు చస్తాడు.. మాకేంటి సంబంధం’.. కేటీఆర్ ఆసక్తికర ట్వీట్

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో వైరల్ ఫీవర్ వణికిస్తోంది. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పితో పాటు జలుబు వంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Update: 2024-09-24 04:20 GMT

దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలను వైరల్ ఫీవర్(Viral fever) వణికిస్తోంది. తీవ్ర జ్వరం, ఒళ్లు నొప్పులు, తలనొప్పితో పాటు జలుబు వంటి లక్షణాలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏ ఆసుపత్రిలో చూసినా జనాలతో కిక్కిరిసిపోతున్నాయి. తాజాగా ఈ ఇష్యూపై బీఆర్ఎస్(BRS) వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్(BRS) స్పందించారు. ఈ మేరకు మంగళవారం సోషల్ మీడియా(ఎక్స్) వేదికగా పోస్టు పెట్టారు. ‘‘ప్రజారోగ్యంపై ప్రభుత్వానికి పట్టింపు లేదు! ఎవడి చావు వాడు చస్తాడు మాకేం సంబంధం అన్నట్టుగా ప్రవర్తిస్తున్నది కాంగ్రెస్ సర్కార్. రోగాలు.. నొప్పులు.. వ్యాధులు.. బాధలతో జనం అల్లాడుతున్నా చలనం లేదు... చర్యలు లేవు. విష జ్వరాలు విజృంభించి ప్రజల ఒళ్ళూ.. ఇళ్లూ గుళ్లవుతున్నా పట్టించుకునే నాధుడే లేడు. బస్తీలకు సుస్తీ చేసింది.. పల్లెలు మంచం పట్టినయ్.. అయినా వైద్యారోగ్య శాఖకు చీమకుట్టినట్టు కూడా లేదు. పారిశుధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా మారి.. దోమలు స్వైర విహారం చేస్తున్నా ప్రభుత్వ శాఖలు మొద్దు నిద్ర వీడటం లేదు. ప్రాణాంతక రోగాలు పట్టి పీడిస్తుంటే.. అరికట్టాల్సిన ప్రభుత్వం అడ్రస్ లేదు’’ అని కేటీఆర్ సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు.


Similar News