కంటి వైద్యం వికటించిందంటూ.. ఆస్పత్రి ఎదుట బాధితుల ధర్నా

కంటి వైద్యం వికటించిందంటూ బాధితులు ధర్నా చేసిన ఘటన మధిర పట్టణంలోని రమేష్ కంటి ఆసుపత్రి ఎదుట సోమవారం చోటు చేసుకుంది.

Update: 2022-12-12 14:37 GMT

దిశ, ఎర్రుపాలెం: కంటి వైద్యం వికటించిందంటూ బాధితులు ధర్నా చేసిన ఘటన మధిర పట్టణంలోని రమేష్ కంటి ఆసుపత్రి ఎదుట సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్లితే.. మధిర నియోజకవర్గ పరిధిలోని ఎరుపాలెం మండలం కాచవరం గ్రామానికి చెందిన షర్మిల(11) అనే విద్యార్థిని కంటిలో నలుసు పడిందని ఆమె తల్లిదండ్రులు నాలుగు రోజుల క్రితం మధిరలోని రమేష్ కంటి ఆసుపత్రికి తీసుకొచ్చారు. బాలికను పరీక్షించిన వైద్యుడు రమేష్ ప్రథమ చికిత్స పాటు అవసరమైన మందులను కంటి డ్రాప్స్‌ను రాసి ఇచ్చాడు. మందులను వాడగా బాలిక కంటి సమస్య పరిష్కారం కాకపోగా ఆ కన్ను కనిపించని పరిస్థితికి చేరుకుందని బాలిక తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో ఆస్పత్రి ఎదుట తమ కూతురికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బాలిక తల్లిదండ్రులతో పాటు సంబంధికులు ధర్నాకు దిగారు.

ఈ విషయాన్ని తెలుసుకున్న మధిర పట్టణ ఎస్సై సతీష్ కుమార్ ఆస్పత్రి వద్దకు చేరుకుని విషయాన్ని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబం వ్యక్తం చేసిన ఆరోపణలపై వైద్యుడు రమేష్ ను ఎస్సై తో పాటు విలేకరులు వివరణ అడిగగా.. వైద్యుడు రమేష్ తాను బాలికకు అవసరమైన ప్రధమ చికిత్స నిర్వహించానని ఆ రోజున పరిస్థితులకు అనుగుణంగా టాబ్లెట్లను కంటి చుక్కల మందులను రాయడం జరిగిందని తెలిపాడు.


తాను చేసిన వైద్యం వలన బాలికకు ఎటువంటి సమస్య ఉత్పన్నం కాదని పేర్కొన్నారు. బాలికను ఆమె తల్లిదండ్రులు మెరుగైన కంటి వైద్యం కోసం విజయవాడ కానీ ఇతర ప్రాంతానికి గాని తీసుకువెళ్లాలని సూచిస్తున్నట్లు వైద్యుడు పేర్కొన్నాడు. తాను చేసిన వైద్యం పట్ల బాలికకు నష్టం జరిగితే తాను శిక్షార్హంగా బాధ్యతను తీసుకుంటానని పేర్కొనడం జరిగింది. ఈ విషయమై బాలిక తల్లిదండ్రులకు నచ్చచెప్పేందుకు చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. నిరుపేద కుటుంబానికి చెందిన వారమని మెరుగైన వైద్యం చేపించే స్తోమత తమకు లేదని.. వైద్యుడు రమేష్ తన కూతురికి మెరుగైన వైద్య సేవలను చేయించాలని షర్మిల తల్లిదండ్రులు డిమాండ్ చేయడం, ధర్నా కొనసాగిస్తుండడం గమనార్హం.

READ MORE

కార్నివాల్ మాయాజాలం.. తప్పుల తడకలుగా ట్రేడ్ లైసెన్సులు..! 

Tags:    

Similar News