CM's meeting : వైరాలో సీఎం సభ నిర్వహణపై ఉత్కంఠ

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన వైరాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది.

Update: 2024-08-07 16:07 GMT

దిశ, వైరా : స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈనెల 15వ తేదీన వైరాలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. ఈనెల 15వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి అశ్వాపురంలో సీతారామ ప్రాజెక్టుకు చెందిన మూడు పంపు హౌస్ లను ప్రారంభించనున్నారు. అనంతరం వైరాలో సుమారు లక్ష మంది రైతులు, ప్రజలతో భారీ రైతాంగ సదస్సును నిర్వహించాలని నిర్ణయించారు. ఈ రైతాంగ సదస్సులో మూడో విడత రూ. 2 లక్షల రుణమాఫీని వైరా నుంచే సీఎం ప్రారంభిస్తారని ఇప్పటికే రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. వైరాలోని తుళ్లురి కోటేశ్వరరావు పామాయిల్ తోట సమీపంలో ఉన్న స్థలాన్ని ఇటీవల రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పరిశీలించి రైతాంగ సదస్సు నిర్వహించేందుకు ఆ స్థలాన్ని ఎంపిక చేశారు. అనంతరం ఆ ప్రాంతంలో సభ నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లను ముమ్మరంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ ముసిమ్మిలాఖాన్ తో పాటు సీపీ సునీల్ దత్ ను ఆదేశించారు. ఈ మేరకు ఆ స్థలంలో అధికారులు ఏర్పాట్లను ప్రారంభించారు.

    ఆ ప్రాంతంలో ఉన్న రైతుల పెసర పంటకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లిస్తుందని అధికారులు స్పష్టం చేశారు. నష్టపరిహారంనకు రైతులను ఒప్పించి పెసర ఫైర్లను ఇప్పటికే తొలగించారు. ఇంతవరకు బాగానే ఉన్నా గత రెండు రోజులుగా వైరాలో కురుస్తున్న విస్తార వర్షాల వల్ల ముందుగా రైతాంగ సదస్సు కోసం ఎంపిక చేసిన స్థలం నల్ల రేగడి ప్రాంతం కావడంతో ఆ ప్రాంతం బురదమయంగా మారింది. మరో మూడు రోజులు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించటంతో ఆ స్థలం మరింత అధ్వానంగా మారే అవకాశం ఉంది. దీంతో సభ నిర్వహణ కోసం వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ వైరా మున్సిపాలిటీ లోని 14వ వార్డులో ఉన్న మరో స్థలమైన డాంబర్ వెంచర్ ను వర్షంలోనే బుధవారం సాయంత్రం పరిశీలించారు.

     అయితే ఆ ప్రాంతంలో రైతాంగ సదస్సు ఏర్పాటు చేసేందుకు సాధ్య అసాధ్యాలపై ఆయన చర్చించారు. సుమారు లక్ష మందితో సదస్సు నిర్వహించాలని ప్రభుత్వం పట్టుదలతో ఉంది. అయితే ప్రస్తుత వర్షం వలన లక్ష మంది ప్రజలు ఉండే సామర్థ్యం ఉన్న గలస నేల స్థలాలు వైరా చుట్టు ప్రాంతంలో కనిపించడం లేదు. దీంతో వైరాలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటనపై ఉత్కంఠ కొనసాగుతోంది. గురువారం వర్షం ఆగిపోతే వైరాలో సీఎం సభ యధావిధిగా కొనసాగే అవకాశం ఉంది. మరో మూడు రోజులు ఇలానే వైరాలో వర్షం కురిస్తే రైతాంగ సదస్సు ఏర్పాటుపై నీలి నీడలు కమ్ముకోనున్నాయి. ఈ పరిణామాలతో వైరాలో కాంగ్రెస్ శ్రేణులు సందిగ్ధంలో ఉన్నారు. 

Tags:    

Similar News