మావోయిస్టుల చావుకు కేంద్ర కమిటీ సభ్యులే కారణం

గురువారం కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు ఆదివాసీ సాయుధ సభ్యులు చనిపోయారు.

Update: 2024-09-06 13:12 GMT

దిశ ప్రతినిధి,కొత్తగూడెం : గురువారం కరకగూడెం పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎదురు కాల్పుల్లో నిషేధిత సీపీఐ మావోయిస్టు పార్టీకి చెందిన ఆరుగురు ఆదివాసీ సాయుధ సభ్యులు చనిపోయారు. వీరి చావుకి మావోయిస్టు కేంద్ర ,రాష్ట్ర నాయకులే కారణమని జిల్లా ఎస్పీ రోహిత్ రాజు తెలిపారు. మావోయిస్టు పార్టీకి చెందిన అగ్రనాయకులు చత్తీస్గడ్ రాష్ట్రంలోని సురక్షిత ప్రాంతంలో తలదాచుకుంటూ అమాయకులైన కింది స్థాయి కేడర్ ను రాష్ట్రంలో అశాంతిని సృష్టించడానికి పావులుగా వాడుకుంటున్నారని అన్నారు. తెలంగాణ రాష్ట్రంలోని సరిహద్దు మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ఆదివాసీ ప్రజల సంక్షేమం, అభివృద్ధి కోసం కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న అన్ని రకాల సంక్షేమ పథకాలను పొందుతూ ఆదివాసీ ప్రజలు ప్రశాంత జీవనాన్ని గడుపుతున్నారని అన్నారు. బలవంతపు వసూల్లే లక్ష్యంగా చేసుకుని నిషేధిత మావోయిస్టు పార్టీ చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుందని పేర్కొన్నారు.

     కాలం చెల్లిన సిద్ధాంతాలతో అమాయకులైన కింది స్థాయి కేడర్ ను రెచ్చగొడుతూ వారి చేతికి ఆయుధాలను ఇచ్చి పోలీసుల పైకి ఉసిగొల్పి వారి ప్రాణాలను కోల్పోయే విధంగా చేస్తున్నారని అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే పథకాలు అమాయకులైన ఆదివాసీ ప్రజలకు అందకుండా చేస్తూ నిషేధిత సీపీఐ మావోయిస్టులు అభివృద్ధి నిరోధకులుగా మారుతున్నారన్నారు. విద్య, వైద్యం,రవాణా వంటి సౌకర్యాలకు వారిని దూరం చేస్తూ అమాయక ఆదివాసీ యువతీయువకులను బలవంతంగా తమ పార్టీలోనికి చేర్చుకొని వారి చేత చట్టవ్యతిరేక కార్యకలాపాలు చేయిస్తూ వారి అమూల్యమైన భవిష్యత్తును నాశనం చేస్తున్నారని తెలియజేశారు.

    ఆదివాసీ ప్రజల అభివృద్ధికి దోహదపడే ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకునే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తమ స్వార్థ ప్రయోజనాల కోసం మావోయిస్టు పార్టీ అగ్రనాయకులు కింది స్థాయి కేడర్ ను చిత్రహింసలకు గురిచేస్తున్నారని తెలిపారు. నిషేధిత సీసీఐ మావోయిస్టు పార్టీలో పనిచేస్తూ లొంగిపోయిన వారికి ప్రభుత్వం తరఫున అందించాల్సిన అన్ని రకాల ప్రతిఫలాలను అందించి,వారికి జీవనోపాధిని కల్పించే బాధ్యత పోలీస్ శాఖ తీసుకుంటుందని తెలిపారు. ప్రజలు తిరస్కరించిన సిద్ధాంతాలను వీడి జనజీవన స్రవంతిలో కలిసి ప్రశాంత జీవితాన్ని గడపాలని కోరారు. కేంద్ర కమిటీ సభ్యుడికి 25 లక్షల రూపాయలు, రాష్ట్ర కమిటీ సభ్యుడికి 20 లక్షల రూపాయలు, జిల్లా కమిటీ సభ్యుడికి 8 లక్షల రూపాయలు, ఏరియా కమిటీ సభ్యుడికి 4 లక్షల రూపాయలను ప్రభుత్వం పునరావాస సహాయం కింద ప్రకటించడం జరిగిందన్నారు. లొంగిపోయిన వారికి సత్వరమే ఈ నగదును అందజేసి వారికి ఉపాధి అవకాశాలను కల్పించి సమాజంలో గౌరవంగా జీవించే విధంగా పోలీస్ శాఖ అండగా ఉంటుందని ఈ సందర్బంగా ఎస్పీ తెలియజేశారు. 

Tags:    

Similar News