CM Revanth: అది ఉద్యోగం కాదు.. ఒక భావోద్వేగం
ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని.. ఓ భావోద్వేగమని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్య కీలకమైన అంశమని, నియామకాలే లక్ష్యం
దిశ, తెలంగాణ బ్యూరో: ఉపాధ్యాయ వృత్తి ఉద్యోగం కాదని.. ఓ భావోద్వేగమని పేర్కొన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిరుద్యోగ సమస్య కీలకమైన అంశమని, నియామకాలే లక్ష్యంగా తెలంగాణ ఉద్యమం సాగిందని, ప్రభుత్వంలో ఉద్యోగాల భర్తీ నిరంతర ప్రక్రియ అని స్పష్టం చేశారు. డీఎస్సీ-2024 ఫలితాలను సచివాలయంలో సోమవారం విడుదల చేసిన సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ... గడచిన పదేళ్ల పాలనలో ఒక్కసారి మాత్రమే డీఎస్సీ జరిగిందని, 7,857 పోస్టులే భర్తీ అయ్యాయని, కానీ ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడిన పది నెలల్లోనే 11,062 పోస్టులకు డీఎస్సీ నిర్వహించినట్లు తెలిపారు. ప్రతీ పోస్టుకు 1:3 నిష్పత్తిలో సర్టిఫికేట్ల వెరిఫికేషన్ చేపడతామని, ఎంపికైన అభ్యర్థులకు అక్టోబరు 9వ తేదీన ఎల్బీ స్టేడియంలో నియామక పత్రాలను అందజేస్తామన్నారు. అభ్యర్థుల కుటుంబాల్లో దసరాకు ముందే పండగ వాతావరణం నెలకొంటుందన్నారు. విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నదని, అందువల్లనే ప్రతీ అసెంబ్లీ నియోజకవర్గంలో ఇంటెగ్రేటెడ్ రెసిడెన్షియల్ కాంప్లెక్సును నెలకొల్పుతున్నట్లు వివరించారు. పేదలందరికీ విద్య అంది తీరాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత టెట్ షెడ్యూలు ఇవ్వాలంటూ నిరుద్యోగుల నుంచి వచ్చిన విజ్ఞప్తి మేరకే పరీక్షలు నిర్వహించామని, డీఎస్సీ రాసేందుకు అదనంగా 1,09,168 మంది అభ్యర్థులు అర్హత సాధించారని వివరించారు. డీఎస్సీ రాత పరీక్షలను జులై 18వ తేదీ నుంచి ఆగస్టు 5వ తేదీ వరకు 26 సెషన్లలో కంప్యూటర్ ఆధారిత విధానంలో (సీబీటీ) నిర్వహించినట్లు తెలిపారు. డీఎస్సీ, టెట్ నిర్వహణలో సమర్థంగా వ్యవహరించిన విద్యా శాఖ అధికారులను సీఎం రేవంత్ అభినందించారు.
వంద ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ :
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందాలన్న లక్ష్యంతో రాష్ట్రంలోని వంద అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి నొక్కిచెప్పారు. గతంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలలు వేర్వురుగా ఉండడంతో పిల్లల్లో ఆత్మన్యూనతా భావం ఏర్పేడదని.. దానిని తొలగించి వారి సమగ్ర వికాసానికి ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. ప్రతీ అసెంబ్లీ సెగ్మెంట్లో దాదాపు 25 ఎకరాల్లో వంద కోట్ల రూపాయలతో వీటిని నెలకొల్పుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే కొడంగల్, మధిర నియోజకవర్గాల్లో ప్రక్రియ ప్రారంభమైందని, ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ఇవి ఉంటాయన్నారు. పేదలకు విద్యను అందించాలనే ఆలోచన గత ప్రభుత్వానికి లేదని, విద్యా శాఖను నిర్లక్ష్యం చేసి బడ్జెట్ కేటాయింపులూ నామమాత్రంగా పెట్టిందన్నారు. ఇప్పుడు విద్యకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తున్నందునే, అధికారంలోకి వచ్చిన రెండు నెలల్లోనే డీఎస్సీ నిర్వహణకు నిర్ణయం తీసుకున్నట్లు గుర్తుచేశారు. మాటల్లోనే కాక చేతల్లోనూ ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇది నిదర్శనమన్నారు.
ప్రస్తుత బడ్జెట్లో విద్యా శాఖకు నిధుల కేటాయింపు పెంచామని, భవిష్యత్తులో మరింతగా పెంచుతామన్నారు. గత ప్రభుత్వం కోళ్ల షెడ్లు, అద్దె గృహాల్లో వసతి గృహాలను ఏర్పాటు చేసి కనీస మౌలిక సౌకర్యాలనూ కల్పించలేకపోయిందని పేర్కొన్నారు. ఇప్పుడు అదే పార్టీకి చెందిన మీడియా, సోషల్ మీడియా ప్రతనిధులు ఆ స్కూళ్ళలోని తాజా పరిస్థితిని, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలపై దుష్ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు ప్రభుత్వంలో బాధ్యతారాహిత్యంగా వ్యవహరించనందునే సమస్యలు తలెత్తాయన్నారు. అందుకే ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటుపై దృష్టి సారించినట్లు తెలిపారు. గత ప్రభుత్వం ఏళ్ల తరబడి టీచర్లకు ప్రమోషన్లు ఇవ్వకుండా జాప్యం చేసిందని, బదిలీల విషయంలోనూ అదే జరిగిందన్నారు. తాము అధికారంలోకి వచ్చాక వివాదాలకు తావు లేని తీరులో బదిలీ, పదోన్నతుల ప్రక్రియను కంప్లీట్ చేశామన్నారు. విద్యపై పెట్టేది ఖర్చుగా భావించడంలేదని, దాన్ని భవిష్యత్తు అవసరాలకు పెట్టే పెట్టుబడిగా చూస్తున్నామన్నారు. విద్యార్థుల సంఖ్యతో ప్రమేయం లేకుండా ప్రభుత్వ పాఠశాలలు నిర్వహిస్తామని ఓ ప్రశ్నకు బదులిచ్చారు.
ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా :
నిరుద్యోగులకు అండగా నిలవడం, ఉద్యోగ నియామకాలే లక్ష్యంగా అధికారంలోకి వచ్చిన 30 రోజుల్లోనే 30 వేలకు పైగా ఉద్యోగాల నియామక పత్రాలు అందించామని సీఎం రేవంత్ గుర్తుచేశారు. గ్రూప్ 1, 2, 3 పోస్టులను అంగడి సరుకుల్లా మార్చిన స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేసి ఎలాంటి లోపాల్లేకుండా పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. మొదటి ఏడాదిలోనే 60 వేలకు పైగా ఉద్యోగాలను భర్తీచేసి నిరుద్యోగ సమస్యను పరిష్కరించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయన్నారు. డీఎస్సీ ఫలితాల విడుదల కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు దామోదర రాజనరసింహ, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, కొండా సురేఖ, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, విద్యా కమిషన్ ఛైర్మన్ ఆకునూరి మురళి, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, విద్యా శాఖ కమిషనర్ ఈవీ నరసింహారెడ్డి, అదనపు డైరెక్టర్ లింగయ్య తదితర అధికారులు పాల్గొన్నారు.
డీఎస్సీ నోటిఫికేషన్ : ఫిబ్రవరి 29, 2024
మొత్తం పోస్టులు : 11,062
స్కూల్ అసిస్టెంట్ (ఎస్ఏ ): 2,629
భాషా పండితులు (ఎల్పీ) : 727
ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ (పీఈటీ) : 182
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (ఎస్జీటీ) : 6,508
స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేటర్స్) : 220
సెకండరీ గ్రేడ్ టీచర్స్ (స్పెషల్ ఎడ్యుకేటర్స్) : 796
డీఎస్సీ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న వారు : 2,79,838
రాత పరీక్షకు హాజరైన వారు: 2,46,584 (88.11%)