Mahesh Kumar Goud: రాహుల్ వదిలిన బాణాన్ని.. సోనియా పంపిన సందేశాన్ని
తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన గాంధీ భవన్లో మీడియాతో మాట్లాడారు.
దిశ, వెబ్డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud) కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆయన రవీంద్ర భారతిలో మీడియాతో మాట్లాడారు. తాను రాహుల్ గాంధీ(Rahul Gandhi) వదిలిన బీసీ బాణాన్ని.. సోనియా గాంధీ(Sonia Gandhi) పంపిన సందేశాన్ని.. మల్లికార్జున ఖర్గే(Mallikarjuna Kharge) పంపిన సైన్యాన్ని అని అన్నారు. బీసీల విషయంలో ఎక్కడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదని కీలక వ్యాఖ్యలు చేశారు. తనను ఒక ధ్యేయంతో పీసీసీ అధ్యక్షుడిని చేశారు.. వారు కోరిన విధంగా ముందుకు పోవాలనేదే నా తపన అని తెలిపారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎందుకు 42 శాతం నుండి 23 శాతానికి తగ్గించారు.. ముందు సమాధానం చెప్పాలని డిమాండ్ కేంద్రాన్నిచేశారు.
ఒక బీసీ బిడ్డను రాష్ట్ర అధ్యక్షుడిగా చేసే దమ్ము ఉందా? అని ప్రశ్నించారు. అసలు చురుగ్గా పనిచేసిన బీసీ బిడ్డ(బండి సంజయ్)ను ఎందుకు తొలగించారో దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బండి సంజయ్కి సహాయ మంత్రి పదవి ఇచ్చి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. తమ పార్టీలో పొన్నం ప్రభాకర్, కేశవరావు, వీహెచ్ లాంటి వారు ఎందరో బీసీల కోసం కొట్లాడుతున్నామని అన్నారు. రేవంత్ రెడ్డి, తాను, పొన్నం ప్రభాకర్ అందరం రాహుల్ గాంధీ సైనికుమని అన్నారు. బీసీ కులగణన జరిగిన తరువాతనే రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళాలని నిర్ణయించినట్లు తెలిపారు.