KCR : కేసీఆర్‌కు నోటీసులు.. హరీశ్‌రావు సహ మరో 8 మందికి సైతం..

మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీచేసింది.

Update: 2024-08-05 07:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజ్ వ్యవహారంలో భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ కోర్టు కేసీఆర్, హరీశ్‌రావు సహా మొత్తం ఎనిమిది మందికి నోటీసులు జారీచేసింది. నాగవెల్లి రాజలింగమూర్తి దాఖలు చేసిన రివిజన్ పిటిషన్‌ను స్వీకరించిన కోర్టు... సెప్టెంబరు 5న విచారణ జరపనున్నట్లు పేర్కొన్నది. ఆ విచారణకు రావాల్సిందిగా ఎనిమిది మందికీ నోటీసులను జారీచేసింది. గతంలో భూపాలపల్లి ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో విచారణ జరిగిన అనంతరం రివిజన్ పిటిషన్ దాఖలు చేయడంతో ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జి విచారణ జరపనున్నారు. మేడిగడ్డ బ్యారేజీ డ్యామేజీపై గతేడాది అక్టోబరు 25న స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, ఆ తర్వాత జిల్లా ఎస్పీకి, డీజీపీకి కూడా కంప్లైంట్ చేశానని, ఎఫ్ఐఆర్ నమోదు చేయకపోవడంతో పాటు ఎలాంటి చర్యలు తీసుకోనందున కోర్టును ఆశ్రయించానని నాగవెల్లి రాజలింగమూర్తి ఆ రివిజన్ పిటషన్‌లో పేర్కొన్నారు.

తొలుత ఫస్ట్ క్లాస్ ప్రిన్సిపల్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ కోర్టులో పిటిషన్ వేశానని, తన పిటిషన్‌ను కొట్టివేసిందని, దానికి కారణాలను కూడా తనకు తెలియజేయలేదని, విధిలేని పరిస్థితుల్లో హైకోర్టును ఆశ్రయించానని, ఆ తర్వాత రివిజిన్ పిటిషన్‌ను జిల్లా కోర్టులో దాఖలు చేయాల్సిందిగా సూచించడంతో ఇప్పుడు దాఖలు చేయాల్సి వచ్చిందని రాజలింగమూర్తి పేర్కొన్నారు. బ్యారేజీలోని ఏడవ బ్లాకులో పిల్లర్ భూమిలోకి కుంగిపోవడం, పెద్ద శబ్దంతో ఒక పిల్లర్‌కు పగుళ్ళు రావడంతో అసిస్టెంట్ ఇంజినీర్ స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారని, తీవ్రవాద శక్తుల ప్రమేయం ఉన్నదనే అనుమానాన్ని వ్యక్తం చేశారని, పోలీసులు కూడా ఐపీసీలోని సెక్షన్ 427 ప్రకారం ఎఫ్ఐఆర్ (నెం. 174/2023) నమోదు చేశారని, మరుసటి రోజే దాన్ని క్లోజ్ చేశారని పిటిషనర్ గుర్తుచేశారు.

కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డ (లక్ష్మీ బ్యారేజీ)కు డిజైన్ మొదలు నిర్మాణంలో నాణ్యతాలోపం, నిర్వహణలో నిర్లక్ష్యం వరకు అప్పటి ముఖ్యమంత్రి హోదాలో కేసీఆర్, ఇరిగేషన్ మంత్రిగా హరీశ్‌రావు సహా ఒక్కో స్థాయిలో ఒక్కొక్కరు బాధ్యులుగా ఉన్నారని రివిజన్ పిటిషన్‌లో పేర్కొన్నారు. కేసీఆర్, హరీశ్‌రావుతో పాటు అప్పటి ఇరిగేషన్ సెక్రటరీ రజత్ కుమార్, సీఎంఓ కార్యదర్శి స్మితా సభర్వాల్, ఇంజినీర్-ఇన్-చీఫ్ హరిరామ్, చీఫ్ ఇంజినీర్ శ్రీధర్, ప్రాజెక్టు కాంట్రాక్టు దక్కించుకున్న ‘మెఘా’ నిర్మాణ సంస్థ అధినేత కృష్ణారెడ్డి, బ్యారేజీని నిర్మించిన ఎల్ అండ్ టీ ప్రతినిధులను పిటిషనర్ ప్రతివాదులుగా పేర్కొనడంతో ఈ ఎనిమిది మందికీ భూపాలపల్లి ప్రిన్సిపల్ సెషన్స్ జడ్జీ నోటీసులు జారీచేశారు. సెప్టెంబరు 5న విచారణ జరగనున్నందున ఈ ఎనిమిది మంది హాజరవుతారా?... లేక వారి తరఫున న్యాయవాదుల్ని పంపుతారా?... అనేది ఆసక్తికరంగా మారింది. 

Tags:    

Similar News