ఏఐ ద్వారా విద్యార్థులకు విద్యా బోధన
సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథ) ను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు.

దిశ, గోదావరిఖని : సర్కారు బడిలో ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (కృత్రిమ మేథ) ను వినియోగిస్తూ విద్యార్థులకు సులభతరంగా విద్య బోధన చేసేందుకు చర్యలు చేపట్టామని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. మంగళవారం గాంధీ పార్క్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, ఉర్దూ మీడియం, ఎంపీపీఎస్ స్కూల్ లను కలెక్టర్ తనిఖీ చేశారు. ఏఐ విద్యా బోధన కోసం ఆయా పాఠశాలలో ఏర్పాటు చేసిన కంప్యూటర్ ల్యాబ్ లను జిల్లా కలెక్టర్ ప్రారంభించి మాట్లాడారు. ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్ (ఏ.ఐ) ను వినియోగిస్తూ విద్యార్థులు ఆకట్టుకునేలా సులభ రీతిలో బోధన ప్రారంభించాలని అన్నారు.
విద్యార్థులకు మంచి లెర్నింగ్ ఎక్స్పీరియన్స్ దక్కేలా చూడాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రయోగాత్మకంగా జిల్లా పరిధిలో ప్రాథమిక పాఠశాల విద్యార్థుల అభ్యాసన సామర్ధ్యాలను పెంచేందుకు ఏఐ సహాయంతో నూతన బోధన పద్ధతులను ప్రవేశపెట్టిందని, మన పెద్దపల్లి జిల్లాలో 20 ప్రభుత్వ పాఠశాలల్లో ముందస్తుగా పైలెట్ ప్రాజెక్టు కింద ఏఐ విద్యాబోధనను ప్రారంభిస్తున్నామని అన్నారు. ఏఐ కోర్సు ప్రతి విద్యార్థికి ప్రత్యేకంగా ఉంటుందని, విద్యార్థి సామర్థ్యాన్ని అంచనా వేస్తూ దానికి అనుగుణంగా బోధన జరిగేలా ఏఐ కోర్సులు రూపొందించడం జరిగిందని అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలో 3 నుంచి 5వ తరగతి చదివే విద్యార్థులకు కనీస అభ్యాస సామర్థ్యాలు పెంచేలా ఏఐను వినియోగించనున్నట్టు చెప్పారు. పిల్లలు తెలుగు, ఆంగ్లం బాగా చదివి, రాసేలా, గణిత అంశాల్లో పట్టు సాధించేలా చూడడమే ఈ కార్యక్రమం లక్ష్యమని అన్నారు. ప్రతి పాఠశాలలో ఇంటర్నెట్ సదుపాయంతో కంప్యూటర్లను ఏర్పాటు చేస్తారని, వెనుకబడిన విద్యార్థులను బ్యాచ్ గా ఎంపిక చేసి తెలుగు, ఆంగ్లం, గణితంలో ఏఐ. ద్వారా తయారు చేసిన పాఠాలు బోధిస్తారని తెలిపారు. అనంతరం పాఠశాలల్లో ఏఐ పాఠాలు నేర్చుకుంటున్న చిన్నారులతో ముచ్చటించారు. కలెక్టర్ వెంట జిల్లా విద్యాశాఖ అధికారి డి.మాధవి, ఏఎంఓ డాక్టర్ పీఎం షేక్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.