పదోన్నతి మరింత బాధ్యతను పెంచుతుంది.. పోలీస్ కమిషనర్..

పదోన్నతి ద్వారా ఉద్యోగులకు మరింత బాధ్యత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు.

Update: 2024-10-19 09:22 GMT

దిశ, గోదావరిఖని : పదోన్నతి ద్వారా ఉద్యోగులకు మరింత బాధ్యత పెరుగుతుందని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం.శ్రీనివాస్ అన్నారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ ఏఎస్ఐగా పదోన్నతి పొందిన ఆరుగురు అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీనివాస్ ఐపీఎస్ (ఐజి) కార్యాలయంలో అభినందించి వారి ర్యాంక్ పదోన్నతి చిహ్నంను అలకరించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ పోలీసు శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని, పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని, గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సీపీ అన్నారు.

ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీసుశాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని, కష్టపడి పని చేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని, ఇప్పటివరకు ఎలాంటి క్రమశిక్షణతో విధులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీస్ పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సూచించారు. ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని, ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటాం, మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని, మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సీపీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిన్ సి.రాజు, ఏఆర్ఏసీపీ ప్రతాప్, ఆర్ఐలు దామోదర్, శ్రీనివాసులు, రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం పాల్గొన్నారు.


Similar News