పోషణ్ మహా 24 ను కట్టుదిట్టంగా అమలు చేయాలి

ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్ మహా 24ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-10-02 12:39 GMT

దిశ,మంథని : ఆరోగ్యవంతమైన పిల్లల కోసం పోషణ్ మహా 24ను కట్టుదిట్టంగా అమలు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్ధిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. బుధవారం మంథనిలోని శివ కిరణ్ గార్డెన్స్ లో నిర్వహించిన పోషణ్​ మహా 2024 ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంత్రి శ్రీధర్ బాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అన్నప్రాసన, అక్షరాభ్యాసం, శ్రీమంతం కార్యక్రమాలలో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టిన పిల్లల నుంచి 6 సంవత్సరాల వయసు వరకు మంచి పౌష్టికాహారం అందించడం ద్వారా ఆరోగ్యవంతమైన పిల్లలు తయారవుతారని అన్నారు.

     పిల్లలకు మంచి పోషకాలు అందించాలనే లక్ష్యంతో భారత ప్రభుత్వం పోషణ్ మహా-24 కార్యక్రమాన్ని అమలు చేస్తుందని అన్నారు. జిల్లాలోని అర్బన్ గ్రామీణ ప్రాంతాల్లో గర్భిణులకు సేవలు అందిస్తున్న అంగన్వాడీ టీచర్లకు ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నానని అన్నారు. ప్రభుత్వం చేపడుతున్న అనేక కార్యక్రమాల అమలులో అంగన్వాడీ టీచర్లు, సహాయకులు కీలకపాత్ర పోషిస్తున్నారని మంత్రి తెలిపారు. కరోనా సమయంలో దేశమంతా లాక్ డౌన్ నిర్వహించినప్పటికీ క్షేత్రస్థాయిలో కరోనా మహమ్మారి పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఇంటింటికీ తిరిగి ప్రచారం చేశారని తెలిపారు. రాబోయే రోజుల్లో అంగన్వాడీ టీచర్లకు భరోసా కల్పించే విధంగా ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటుందని మంత్రి పేర్కొన్నారు. ఐసీడీఎస్ లో జిల్లాలో ఎక్కడైనా అంగన్వాడీ టీచర్లు సహాయకుల పోస్టులు ఖాళీ ఉంటే వెంటనే భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటామని అన్నారు.

    అంగన్వాడీ భవనాల నిర్మాణానికి ప్రతిపాదనలు రూపొందించాలని సంబంధిత అధికారులకు మంత్రి సూచించారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా అందించే పౌష్టికాహారం నాణ్యతలో ఎక్కడా లోపం జరగవద్దని, అందరికీ పౌష్టికాహారం సమగ్రంగా అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి సీడీపీఓ లను ఆదేశించారు. అంగన్వాడీ టీచర్లకు, సహాయకుల ఆరోగ్య పరిస్థితులు చెక్ చేసేందుకు మెడికల్ క్యాంపు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ను కోరారు. పౌష్టికాహారం ప్రాముఖ్యత పై సదస్సుల నిర్వహణ, ఎటువంటి ఆహారంలో ఏ పోషకాలు ఉంటాయి, పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి దాని నివారణకు తీసుకోవాల్సిన చర్యలు మొదలైన అంశాలపై విస్తృత ప్రచారం కల్పించాలని మంత్రి సూచించారు. జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ అంగన్ వాడీ కేంద్రాలు పూర్వ విద్యా కేంద్రాలుగా మారుతున్నాయని, కర దీపిక, ప్రియదర్శిని ప్రకారం పిల్లలకు ఆట పాటలతో బోధన అందించాలని అన్నారు.

    ప్రతి రోజూ అంగన్ వాడీ కేంద్రాలలో నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం బోధన జరగాలని అన్నారు. ప్రతి బుధవారం పోషక లోపం ఉన్న పిల్లల తల్లిదండ్రులతో పిల్లలకు అందించాల్సిన పోషకాహారం, పాటించాల్సిన శుభ్రత పై అవగాహన కల్పించాలని కలెక్టర్ సూచించారు. గ్రామాలలో  అనాథ పిల్లలు, సెమీ అర్బన్ పిల్లల జాబితా ఉంటే సేకరించి సమర్పించాలని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలలో పిల్లల ఎదుగుదలను రెగ్యులర్ గా మానిటరింగ్ చేయాలని, ప్రతి పిల్లవాడి ఎత్తు, బరువు పరిశీలించి సరైన వివరాలు నమోదు చేయాలని, పోషక లోపాలు ఉన్న పిల్లలకు బాలామృతం తప్పనిసరిగా అందజేయాలని కలెక్టర్ అంగన్ వాడీ టీచర్లకు సూచించారు. గర్భిణులకు అనేమియా ఉంటే అవసరమైన పోషకాహారం, మందులు అందజేయాలని కలెక్టర్ అధికారులకు ఆదేశించారు. విలోచవరం అంగన్వాడీ సెంటర్ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం స్వచ్ఛతా హీ సేవ పోస్టర్ ను విడుదలచేశారు. ఈ కార్యక్రమంలో మంథని రెవెన్యూ డివిజన్ అధికారి వి.హనుమానాయక్, జిల్లా సంక్షేమ అధికారి రౌఫ్ ఖాన్, సీడీపీఓలు, అంగన్ వాడీ టీచర్లు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు. 

Tags:    

Similar News