మంథని ప్రాంతాన్ని సరస్వతి నిలయంగా తీర్చిదిద్దుతా

మంథని నియోజకవర్గ ప్రాంతాన్ని సరస్వతి నిలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, అదే విధంగా పేదవారికి నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు.

Update: 2024-10-11 10:27 GMT

దిశ, మంథని : మంథని నియోజకవర్గ ప్రాంతాన్ని సరస్వతి నిలయంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని, అదే విధంగా పేదవారికి నాణ్యమైన విద్యనందించడమే లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు అన్నారు. శుక్రవారం మంత్రి శ్రీధర్ బాబు,పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ, జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్షతో కలిసి మంథని మండలంలో అడవి సోమనపల్లి గ్రామంలో 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల పనులకు శంకుస్థాపన చేశారు.

    ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ప్రపంచ మేటీ విద్యార్థులను తయారు చేసేలా యంగ్ ఇండియా విద్యా సంస్థలను ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థల కింద ప్రభుత్వం మొదటి విడతలో 28 పాఠశాలలను మంజూరు చేసిందని, మానేరు నది ఒడ్డున ఉన్న అడవిసోమనపల్లి గ్రామంలో యంగ్ ఇండియా సమీకృత విద్యా సంస్థ రావడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. గత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించిన డీఎస్సీ నియామకం అంశాన్ని రికార్డు సమయంలో  పూర్తి చేసి ఇటీవల ముఖ్యమంత్రి చేతుల మీదుగా 11 వేలకు పైగా నూతన టీచర్లను నియమించినట్టు తెలిపారు. ఇదే గ్రామానికి చెందిన శ్రవణ్ కుమార్ అనే యువకుడికి ఎస్జీటీ ఉద్యోగం లభించిందని అన్నారు.

    25 ఎకరాల విస్తీర్ణంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ  వంటి అన్ని వర్గాల విద్యార్థులు ఒకే ప్రాంగణంలో చదివేలా ఈ విద్యా సంస్థ ఉంటుందని అన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలో  4వ తరగతి నుంచి 12వ తరగతి వరకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యా బోధన అందుతుందని, విద్యార్థుల సౌకర్యం కోసం తరగతి గదులలో డిజిటల్ స్మార్ట్ బోర్డ్, కంప్యూటర్ ల్యాబ్, 5 వేలకు పైగా పుస్తకాలతో కూడుకున్న గ్రంథాలయం ఏర్పాటు చేసినట్టు తెలిపారు. క్రీడలను ప్రోత్సహించేందుకు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల్లో క్రికెట్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్, టెన్నిస్ మొదలగు క్రీడలు ఆడేందుకు అవసరమైన గ్రౌండ్, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నట్టు తెలిపారు. వచ్చే సంవత్సరం దసరా నాటికి ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థల నిర్మాణం పూర్తి చేసి విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పారు. ఈ విద్యా సంస్థల్లో 2500 పైగా విద్యార్థులు చదువుకుంటారని, వీరికి 120 మంది టీచర్లను కేటాయించనున్నట్టు తెలిపారు. సొంతంగా విద్యుత్తు ఉత్పత్తి చేసుకునేలా చర్యలు తీసుకుంటామని అన్నారు.

    250 నుంచి 300 కోట్లు ఖర్చు చేసి ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణం చేస్తున్నామని అన్నారు. త్వరలో రామగుండం,పెద్దపల్లి నియోజకవర్గాల్లో కూడా ఇటువంటి ఇంటిగ్రేటెడ్ స్కూళ్లను మంజూరు చేసి పనులు ప్రారంభిస్తామని మంత్రి తెలిపారు. అనంతరం మంత్రి గౌడ కులస్తులకు కాటమయ్య రక్షక కవచ కిట్లను పంపిణీ చేశారు. పెద్దపల్లి ఎంపీ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాలకు అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యను అందించాలని ప్రజా ప్రభుత్వం నిర్ణయించి ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థలను నిర్మిస్తుందని అన్నారు. హైదరాబాద్ లో కాక వెంకటస్వామి విద్యా సంస్థను ఏర్పాటు చేసి సంవత్సరానికి 5 వేల మందికి తక్కువ ఫీజుతో విద్య అందిస్తున్నారని తెలిపారు.

     కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ పిల్లలకు అవసరమైన వసతులతో కూడిన రెసిడెన్షియల్ విద్యా సంస్థ ఆశించిన స్థాయిలో లేవని గమనించి ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ విద్యా సంస్థల నిర్మాణానికి పూనుకున్నట్టు తెలిపారు. ముందస్తుగా 28 నియోజకవర్గాలలో నేడు శంకుస్థాపన చేస్తున్నట్టు చెప్పారు. మన జిల్లాలో మంథని అసెంబ్లీ నియోజకవర్గంలోని అడవి సోమనపల్లి గ్రామంలో ఇంటిగ్రేటెడ్ విద్యాసంస్థ మంజూరైనట్టు చెప్పారు. విద్యాసంస్థ కోసం 900 మీటర్ల ప్రత్యేక 4 లైన్ రోడ్డు వేసేందుకు ప్రతిపాదనలు రూపొందించామని అన్నారు. కార్యక్రమంలో మంథని మున్సిపల్ చైర్ పర్సన్ పెండ్రి రమ, ఆర్అండ్​బీ ఈఈ భావ్ సింగ్, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ అనిల్, ఎక్సైజ్ సూపరింటెండెంట్ మహిపాల్ రెడ్డి, ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.  

Tags:    

Similar News