Fast Food: ఫాస్ట్ ఫుడ్‌.. పరేషాన్! నిషేధిత రంగులు కలిపిన ఆహారం విక్రయం

ఫాస్ట్‌ఫుడ్ ఆహారం ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారిపోయింది.

Update: 2024-08-16 02:48 GMT

దిశ, హుజూరాబాద్ రూరల్ : ఫాస్ట్‌ఫుడ్ ఆహారం ప్రస్తుత సమాజంలో ఫ్యాషన్‌గా మారిపోయింది. పేద, మధ్య, ధనికులు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ప్రాధాన్యమిస్తున్నారు. ఉరుకుల పరుగుల జీవితంలో తినుబండారాలు తయారు చేసుకోలేక ఫాస్ట్ ఫుడ్‌పై మక్కువ చూపుతున్నారు. ప్రాచ్యాతపు ఆహారపు అలవాట్లను వొంట పట్టించుకుంటున్నారు. అయితే వీటి వెనుక ఉన్న అనారోగ్య సమస్యలు గుర్తించలేకపోతున్నారు. రోగ నిరోధక శక్తి తగ్గడానికి, అధిక బరువు పెరగడానికి, పెద్ద వయసు వారిలో పొట్ట పెరగడానికి ఫాస్ట్ ఫుడ్, ఇన్‌స్టంట్ ఫుడ్ కారణమని వైద్యులు పేర్కొంటున్నారు.

నాణ్యతా ప్రమాణాలు గాలికి..

ఆకలి రుచి ఎరుగదు.. నిద్ర సుఖ మెరుగదు అంటారు. ఈ సామెతను అందిపించుకున్న కొందరు వ్యాపారులు హుజూరాబాద్ పట్టణంలో అనేక ఫాస్ట్ ఫుడ్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో నూడుల్స్, పానీపూరి, బేకరీ ఐటమ్స్, నాన్ వెజ్, ఫ్రైడ్ రైస్ వంటి ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. అయితే వీటిలో చాలావరకు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. తక్కువ ధరకు ఆహార పదార్థాలు అంటూ బోర్డులు వేలాడదీసి అమ్మకాలు సాగిస్తున్నారు. ఫలితంగా నాణ్యత లేని ఆహారం తిని ప్రజలు అనారోగ్యం కొనితెచ్చుకుంటున్నారు.

పట్టణంలో ఎక్కడపడితే అక్కడ పదుల సంఖ్యలో దుకాణాలు దర్శనమిస్తున్నాయి. వీటిలో చాలావరకు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించడం లేదు. ఆహార పదార్థాల విక్రయాల్లో కల్తీ రాజ్యమేలుతోంది. ఇది తెలియక తింటున్న భోజనప్రియులు అనారోగ్యాన్ని కొని తెచ్చుకుంటున్నారు. వివిధ పనుల నిమిత్తం హుజూరాబాద్ పట్టణానికి వివిధ గ్రామాల నుంచి రోజు వస్తున్న ప్రజలు, విద్యార్థులు ఈ ఆహార పదార్థాలు వైపు మొగ్గు చూపుతున్నారు. తక్కువ ధరకే లభిస్తుండడంతో వీటిని లొట్టలేసుకుంటూ తింటున్నారు. కొంతమంది దుకాణదారులు రుచితో ఆకట్టుకునేందుకు ఆరోగ్యానికి హాని కలిగించే నిషేధిత వస్తువులతో ఆహార పదార్థాలు తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది.

అంతా అపరిశుభ్రతే..

దుకాణదారులు కనీస నాణ్యత ప్రమాణాలు పాటించకపోగా చాలా వరకు షాపులు రోడ్ల పక్కనే ఏర్పాటు చేస్తుండడం ఆందోళన కలిగించే విషయం. దోమలు, ఈగలు ఆహార పదార్థాలపై వాలుతాయి. వంటకాలకు వాడిన నూనె తిరిగి వాడుతుండడంతో జీర్ణకోశ వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రమాదకర రంగులు సైతం ఆహార పదార్థాలలో వేస్తున్నారు. ఆహారపదార్థాలు సర్వం రంగులమయంగా ఆకర్షనీయంగా కన్పిస్తుండడంతో వినియోగదారులు అలవాడు పడుతున్నారు. చికెన్ పకోడీలో రంగు, జిలేబిలో రంగు, నోరూరించే కారలో రంగులు ఇలా చెప్పుకుంటూ పోతే దాదాపు తినుబండారాలన్నింటిలో రంగులు కలుపుతున్నారు. దీంతో ఆహారం సహజత్వం కోల్పోయి కలుషితమవుతుంది. వీటిని తినడం ద్వారా మనిషి వ్యాధి నిరోధక శక్తి కోల్పోతున్నట్లు తెలుస్తోంది. ఇది తెలియని చాలామంది తక్కువ ధరకు లభిస్తుందని ఆకలి తీర్చుకోవడానికి ఫాస్ట్ ఫుడ్‌ను ఇష్టంగా లాగించేస్తున్నారు.

ఫాస్ట్‌ఫుడ్ మంచిది కాదు: మధు, చెల్పూర్, వైద్యాధికారి

ఫాస్ట్ పుడ్‌ను తినడం ఆరోగ్యానికి మంచిది కాదు. ప్రధానంగా యువత ఫాస్ట్ ఫుడ్ వైపు మక్కువ చూపుతుంది. రుచులు, రంగులకు తలొగ్గి ఫాస్ట్ ఫుడ్‌లోకి వెళ్లి తినేస్తున్నారు. దీని వల్ల వచ్చే అనర్ధాలను మాత్రం గుర్తించడం లేదు. ఈ విషయంలో తల్లిదండ్రులు తమ పిల్లలను జాగ్రత్తపరచాలి. ఫాస్ట్ ఫుడ్ వల్ల అనేక వ్యాధులు వస్తాయని వారికి చెప్పాలి. అధికారులు సైతం తనిఖీలు చేపట్టాలి. 

Tags:    

Similar News