జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా...

జగిత్యాలలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి.

Update: 2024-07-04 11:46 GMT

దిశ, జగిత్యాల ప్రతినిధి : జగిత్యాలలో ఎమ్మెల్సీ వర్సెస్ ఎమ్మెల్యే అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఒకే పార్టీలోని ఈ ఇద్దరి నాయకుల మధ్య ఉన్న రాజకీయ వైరం మరోసారి తెరపైకి వచ్చింది. జగిత్యాల పట్టణంలోని ఎనిమిదవ వార్డు బేడ బుడగ జంగాల కాలనీలో బోనాల పండుగ సందర్భంగా జీవన్ రెడ్డి ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలో విప్ లక్ష్మణ్ కుమార్ తో పాటు స్థానిక కాంగ్రెస్ నాయకుల ఫొటోలను ముద్రించారు. అయితే ఆ ఫ్లెక్సీ ని ఏర్పాటు చేసిన గంటల వ్యవధిలోనే మున్సిపల్ సిబ్బంది తొలగించారు. బోనాల కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తిరుగు ప్రయాణంలో ఫ్లెక్సీలను తొలగిస్తున్న మున్సిపల్ సిబ్బందిని ఎందుకు తీసేస్తున్నారని ప్రశ్నించారు. సిబ్బంది బదులిస్తూ తమను

    టీపీఎస్ తేజస్విని తొలగించాలని చెప్పడంతోనే తీసేస్తున్నామని తెలిపారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంటనే మున్సిపల్ అధికారులతో మాట్లాడి ఫ్లెక్సీలను ఎలా తొలగిస్తారు అంటూ మండిపడ్డారు. టీపీఎస్ తేజస్విని పై జిల్లా కలెక్టర్ కు ఫిర్యాదు చేస్తానని, అసలు తనను జగిత్యాలలో ఉండనిస్తారా వెళ్లగొడతారా అంటూ అసహనం వ్యక్తం చేస్తూ అక్కడి నుండి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫొటో సదరు ఫ్లెక్సీలో లేకపోవడమే ఈ వివాదానికి కారణమైనట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలో చేరినప్పటి నుండి కాంగ్రెస్ లో గ్రూపు రాజకీయాలు మొదలైనట్లుగా ప్రచారం జరుగుతుంది. ఈ ప్రచారానికి ఆజ్యం పోసినట్లు గా ఫ్లెక్సీ వివాదం సరికొత్త చర్చకు దారి తీసింది.


Similar News