మామను ఆదర్శంగా తీసుకొని ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన అల్లుడు

ఒకేసారి మూడు ప్రభుత్వ కొలవులను సాధించి జిల్లాకు చెందిన యువకుడు అబ్బురపరిచాడు.

Update: 2024-10-04 05:31 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: ఒకేసారి మూడు ప్రభుత్వ కొలవులను సాధించి జిల్లాకు చెందిన యువకుడు అబ్బురపరిచాడు. జిల్లాలోని తంగళ్ళపల్లి మండలం నేరెళ్ల గ్రామానికి చెందిన కోలా వినయ్ కుమార్ స్కూల్ జిల్లా అసిస్టెంట్ సోషల్‌లో 10వ ర్యాంక్, జిల్లా ఎస్జీటీలో 38వ ర్యాంక్, వసతి గృహ సంక్షేమ అధికారి జోనల్‌లో 58వ ర్యాంక్ సాధించి ఒకేసారి మూడు ప్రభుత్వ కొలువులను సాధించాడు. ఇక తన మామ అయిన పసుల స్వామి పౌర సరఫరాల అధికారిగా విధులు నిర్వర్తిస్తున్నాడు. అయితే అతన్ని ఆదర్శంగా తీసుకొని నిత్యం సాధన చేసి కొలువులను సాధించానని కోలా వినయ్ కుమార్ తెలిపారు. ఈ కొలువులు తన తండ్రి, మామ స్వామిల నిరంతర ప్రేరణతో ఎలాంటి కోచింగ్ లేకుండా సొంత నోట్స్, పక్కా ప్రణాళికతో, రోజు వారి మోక్ టెస్ట్ రాయడం వల్ల సాధ్యం అయిందని అంటున్నాడు. అంతేకాకుండా తదుపరి గ్రూప్ 1 కూడా సాధించి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు వినయ్ తెలిపాడు. కాగా మూడు ఉద్యోగాలు సాధించినందుకు గ్రామస్తులు ఆయనను అభినందించారు.


Similar News