ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే : కలెక్టర్ కోయ శ్రీహర్ష

గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు

Update: 2024-10-03 10:04 GMT

దిశ, ముత్తారం/రామగిరి: గ్రామంలోని ప్రతి కుటుంబాన్ని కవర్ చేస్తూ ఫ్యామిలీ డిజిటల్ కార్డు సర్వే పకడ్బందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అన్నారు. గురువారం కలెక్టర్ ముత్తారం, రామగిరి మండలాల్లో పర్యటించారు. ఫ్యామిలీ డిజిటల్ సర్వే పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన ముత్తారం మండలంలోని దర్యాపూర్ గ్రామాన్ని కలెక్టర్ సందర్శించి సర్వే ప్రక్రియను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం వివరాలు పకడ్బందీగా సేకరించి 5 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. అక్టోబర్ 9న వివరాల స్క్రూటినీ చేసి అక్టోబర్ 10న ఫ్యామిలీ డిజిటల్ కార్డుకు సంబంధించి సమాచారంతో కూడిన నివేదిక సమర్పించాలని తెలిపారు. అనంతరం ముత్తారం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని పరిశీలించి పెండింగ్ భూ సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలను సూచించారు.

ముత్తారంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేసి ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని అన్నారు. అనంతరం రామగిరి మండలంలోని బేగంపేట గ్రామంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని ఔట్ పేషెంట్ విభాగం ఆపరేషన్ థియేటర్, ల్యాబ్, మందుల పంపిణీ విభాగాలను ఆయన పరిశీలించారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ఎన్సీడీ సర్వే అమలు అవుతున్న తీరు, ఆసుపత్రిలో జరుగుతున్న ప్రసవాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో అవసరమైన మేర మందుల స్టాక్ అందుబాటులో ఉంచుకోవాలని అధికారులకు సూచించారు. ఈ తనిఖీల్లో ముత్తారం తహశీల్దార్ సుమన్, ఎంపీడీవో సురేష్, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Similar News