Kaleswaram Commission: నేటి నుంచి కాళేశ్వరం కమిషన్ తదుపరి విచారణ షురూ..

కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో అవకతవకలకు సంబంధించి తదుపరి విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది.

Update: 2024-09-19 05:14 GMT

దిశ, వెబ్‌డెస్క్: కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టు పరిధిలోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల నిర్మాణాల్లో అవకతవకలకు సంబంధించి తదుపరి విచారణ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు బుధవారం రాత్రి కాళేశ్వరం కమిషన్ చైర్మన్ సుప్రీం కోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జస్టిస్ పినాకి చంద్రఘోష్ హైదరాబాద్‌కు చేరుకున్నారు. విచారణలో భాగంగా పలువురు ఇంజనీర్లు, అధికారులు సమర్పించిన అఫిడవిట్‌లపై నేడు కమిషన్ విచారణ చేపట్టనుంది. అయితే, ఇందులో భాగంగా ఓపెన్ కోర్టుకు ఎవరిని పిలవాలనే దానిపై జస్టిస్ చంద్రఘోష్ ఓ నిర్ణయానికి రానున్నారు. గతంలో ఓపెన్ కోర్టులో విచారణలో ఇంజనీర్లు, అధికారులను ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విచారించారు. ఇక నుంచి ఆ విచారణ సమయాన్ని ఉదయం 11 నుంచి సాయంత్రం 5 గంటల వరకు పొడిగించారు. అయితే, కమిషన్ ప్యానెల్ సాక్షుల వాంగ్మూలాలను రికార్డ్ చేయనుంది. అదేవిధంగా వారిని క్రాస్ ఎగ్జామిన్ చేయనున్నట్లుగా తెలుస్తోంది.

కాగా, తెలంగాణలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్ కాళేశ్వరం ఎత్తిపోతల నిర్మాణంలో జరిగిన అవకతవకలపై గత ఏప్రిల్‌లో కమిషన్‌ను ఏర్పాటు చేసి విచారణకు ఆదేశించింది. దీంతో గతేడాది అక్టోబర్ 22న మేడిగడ్డ బ్యారేజీకి కుంగిన విషయం, ప్రాజెక్టు డిజైన్లు, మిషనరీ ఇతర అంశాలపై రాష్ట్ర నీటి పారుదల శాఖ అధికారులు, ఇంజినీర్ల వాంగ్మూలాలను కమిషన్ సేకరస్తోంది. అదేవిధంగా అన్నారం, సుందిళ్ల అనే మరో రెండు బ్యారేజీల్లో సాంకేతిక సమస్యలను కూడా పరిశీలిస్తోంది. ఈ సందర్భంగా జస్టిస్ ఘోష్‌తో సహా కమిషన్ సభ్యులు ఇప్పటికే మూడు బ్యారేజీలను క్షేత్ర స్థాయిలో సందర్శించారు.  


Similar News