phone tapping case: బ్లూ కార్నర్ నోటీసులతో పని కాదు: సీపీ కొత్తకోట

ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

Update: 2024-08-24 12:36 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసుపై హైదరాబాద్ సీపీ కొత్త కోట శ్రీనివాస్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసు దర్యాప్తు యాక్టివ్ గా కొనసాగుతున్నదని చెప్పారు. కీలక నిందితులను ఇప్పటికే అరెస్టు చేశామని, ఈ కేసుతో సంబంధం ఉన్న ప్రతి ఒక్కరిని విచారిస్తామన్నారు. శనివారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన సీపీ.. నిందితులుగా ఉన్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సీబీఐ డైరెక్టర్ ను ఇప్పటికే కోరామన్నారు. బ్లూ కార్నర్ నోటీసులతో అమెరికా నేరస్తులను మనకు అప్పగించదని చెప్పారు. సీబీఐ రెడ్ కార్నర్ నోటీసు తర్వాత వారిని స్వదేశానికి తీసుకువస్తామన్నారు. సీబీఐ డైరెక్టర్ ను తానే స్వయంగా కలిసి కేసు స్వరూపాన్ని వివరించానని తమ విజ్ఞప్తి పట్ల సానుకూలంగా స్పందించారన్నారు. కాగా గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పలువురు ప్రతిపక్ష నాయకులతో పాటు జడ్జీలు, వ్యాపారవేత్తలతో పాటు పలువురు ప్రముఖుల ఫోన్లను ట్యాపింగ్ కు పాల్పడ్డారన్న అభియోగాలతో రాష్ట్ర పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఇప్పటికే ప్రణీత్ రావు, భుజంగరావు, రాధాకిషన్ రావు, తిరుపతన్నలను పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు పంపించారు. ఇందులో అనారోగ్య కారణాలతో భుజంగరావుకు ఇటీవలే షరతులతో కూడిన మధ్యంతర బెయిల్ లభించింది.


Similar News