కొత్త చెరువు కబ్జాపై హైడ్రా సీరియస్.. అక్రమ కట్టడాలను కూల్చివేస్తున్న అధికారులు
అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తచెరువు ఎఫ్ టి ఎల్(FTL), బఫర్ జోన్తో పాటు పద్మావతి నగర్ వెంచర్ని కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ వాల్తో పాటు ఆ స్థలంలో నిర్మించిన నిర్మాణాలని హైడ్రా కూల్చివేస్తుంది.
దిశ, పటాన్ చెరు: అమీన్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని కొత్తచెరువు ఎఫ్ టి ఎల్(FTL), బఫర్ జోన్తో పాటు పద్మావతి నగర్ వెంచర్ని కబ్జా చేసి నిర్మించిన కాంపౌండ్ వాల్తో పాటు ఆ స్థలంలో నిర్మించిన నిర్మాణాలని హైడ్రా కూల్చివేస్తుంది. ఆదివారం ఉదయం హెచ్ఎంటి(HMT) స్వర్ణపురి కాలనీలోని 323, 324, 329 సర్వే నంబర్లలో అక్రమ నిర్మాణాలను కూల్చి వేస్తున్నారు. సర్వే నంబర్లు 193, 194, 323 లో శ్రీ పద్మావతి నగర్ పేరుతో 24 ఎకరాలు 1982లో లేఔట్ వేయగా అందులో 293 మంది ప్లాట్లు కొనుగోలు చేశారు. అయితే ఆ భూముల్ని ఆంధ్రప్రదేశ్ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డితో పాటు మరి కొందరు వ్యక్తులు కబ్జా చేసి తమ ఆధీనంలోకి తీసుకుని బెదిరిస్తున్నారని ప్లాట్ ఓనర్స్ హైడ్రా కమిషనర్ రంగనాథ్ దృష్టికి తీసుకెళ్లారు.
అదేవిధంగా పెద్ద చెరువుకు అనుసంధానంగా ఉన్న కొత్తచెరువు కబ్జా చేసి ఆరు ఎకరాలకు పైగా చెరువును పెద్ద పెద్ద బండరాళ్లు మట్టితో సదరు వ్యక్తులు పూడ్చి వేశారు. ఈ ఫిర్యాదు క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ గతవారం అమీన్ పూర్లో పర్యటించి ఈ అక్రమ తతంగాన్ని పరిశీలించారు. కొత్త చెరువు కబ్జాతో పాటు పద్మావతి లేఔట్ భూముల్ని తన ఆధీనంలోకి తీసుకున్న విషయం నిజమేనని అధికారం నిర్ధారించారు. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం నుంచి హెచ్ఎంటి స్వర్ణపురి కాలనీలోని సదరు అక్రమ నిర్మాణాలను రెవెన్యూ మున్సిపల్ అధికారుల సహాయంతో హైడ్రా ఆధికారులు తొలగిస్తున్నారు. ఈ నిర్మాణాల తొలగింపుతో పాటు వాణి నగర్లోని పెద్ద చెరువు ఎఫ్ టి ఎల్, బఫర్ జోన్లో వెలిసిన నిర్మాణాలపై హైడ్రా చర్యలు తీసుకొనున్నట్లు తెలుస్తోంది.